గుంటురు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది. పలుమార్లు వాయిదాపడుతున్న వచ్చిన ఈ ఎన్నిక ఈ రోజు జరగనుంది. టీడీపీ నుంచి 9 మంది, జనసేన నుంచి ఒకరు, వైసీపీ నుంచి 8 మంది ఎంపీటీసీలు గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఒక ఎంపీటీసీ సభ్యుడు టీడీపీకి మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీ నుంచి బీసీ మహిళ లేకపోవడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. వైసీపీలో ఇద్దరు బీసీ మహిళలు ఎంపీటీసీలుగా గెలవడంతో ఆ పార్టీలో పోటీ నెలకొంది. కానీ వైసీపీకి మెజార్టీ సభ్యులు లేకపోవడంతో పీఠం దక్కడంలేదు.
స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ రెబల్ ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి పోటీ చేస్తానని చెప్తుండటంతో పద్మావతిని ఎన్నికకు హాజరుకాకుండా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చూశారు. ఏడుగురు సభ్యులతో మాత్రమే ఎమ్మెల్యే ఆర్కే ఎంపీపీ ఎన్నికకు హాజరైయ్యారు. అయితే పద్మావతి హాజరుకాకపోవడంపై ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేశారని ఆమె కుమారుడు యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు. కాగా దుగ్గిరాలలో ఇవాళ జరుగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నికకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని ఆదేశించడంతో సుమారు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు మధ్య ఎన్నికను నిర్వహిస్తున్నారు.