ఏపీ అసెంబ్లీ 2023-24 బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్ సుపరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో నవరత్నాల పాలన సాగుతోందని, DBT ద్వారా అవినీతి లేకుండా లబ్ధిదారులకు సొమ్ము నేరుగా చేరుతోందని అన్నారు.
రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.19 లక్షలకు పెరిగిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్ధేశించి ఆయన తొలిసారిగా ప్రసంగించారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని ఆయన చెప్పారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశమైంది. ఈనెల 24వ తేదీ వరకు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై మంత్రివర్గం చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. కాగా రూ.2.60 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని సమాచారం.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు
– అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు.
– కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.
– వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం.
– ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.
– 11.43 శాతం గ్రోత్ రేటును సాధించాం.