Site icon HashtagU Telugu

Anam comments : ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి సూత్రధారులు..!!

Aanam

Aanam

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి సూత్రధారులు, పాత్రధారులు అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయన్నారు. జగతి పబ్లికేషన్స్ కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. క్విడ్ ప్రోకో 1లో పబ్లికేషన్స్ కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆరోపించారు. జగన్మోహనరెడ్డి కేసుల్లో ఏ5గా ఉన్న ట్రైడెంట్, ఇదే సంస్థకు అధిపతి పెనాక శరత్ ఏ8 అని.. వీళ్లే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పెనాక శరత్, విజయసాయి అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయాన అన్నఅని తెలిపారు. అరబిందో గ్రూపు కంపెనీలు శరత్, రోహిత్ భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయని చెప్పారు.

క్విడ్ ప్రోకో కేసు ప్రారంభం నుంచి అన్నీ విజయసాయి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళ్లింది కూడా లిక్కర్ స్కాంలో తన భార్యను కాపాడుకునేందుకే అని చెప్పారు. దావోస్ పర్యటనకు జగన్ వెళ్లింది సారాయి లావాదేవీల కోసమేనన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. సాక్షిలో పెట్టుబడులకి అరబిందో కంపెనీలకు సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు భూములు ఇచ్చినట్లు కేసు నమోదైందని చెప్పారు. సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసుల చిట్టా చాలా ఉందన్నారు. జగన్, విజయసాయి, భారతిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. జగన్ డబ్బు పిశాచని, రెండేళ్ల క్రితం అదాన్ డిస్టలరీలు ప్రారంభించి రూ. 5 వేల కోట్లు సంపాదించారని చెప్పారు. ఆ డబ్బునే ఢిల్లీ లిక్కర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

Exit mobile version