Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజ‌ధాని రైతుల‌తో నారా భువ‌నేశ్వ‌రి

ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 11:09 PM IST

ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నారా భువనేశ్వరి అన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెపుతుండేవారిని.. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని భువనేశ్వరి రైతులతో అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు పెద్దఎత్తున తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసుపెట్టి జైల్లో పెట్టిందని రైతులు అన్నారు. ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని రైతులు భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం, భూములు ఇచ్చిన రైతుల నేటి పరిస్థితి, ప్రభుత్వ కుట్ర పూరిత చర్యలపై రైతులు మాట్లాడారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని అన్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టిందో వివరించారు. తనకు అన్నీ తెలుసని.. రైతులు ధైర్యంగా నిలబడాలని.. మళ్లీ మంచి రోజులు వస్తాయని భువనేశ్వరి అన్నారు. రాజధాని విధ్వంసం కంటే.. చంద్రబాబును జైల్లో పెట్టిన ఘటనే తమకు ఎక్కువ బాధ కలిగించిందని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టగా భువనేశ్వరి వారిని ఓదార్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతి నుంచి ఉదయం బయలు దేరి రాజమహేంద్రవరం వస్తున్న తమను పోలీసులు వీరవల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారని మహిళలు, రైతులు భువనేశ్వరికి తెలిపారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళనా చేసినా కనికరించలేదని మహిళలు అన్నారు. అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళ్తున్నామని చెప్పిన తర్వాతే తమను అనుమతించారని పేర్కొన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునేందుకు పోలీసులు తమను అనుసరించారన్నారు. అమరావతి ఉద్యమం నాటి నుంచి ప్రభుత్వం తమను వేధిస్తూనే ఉందని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములు రాజధానికి ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమవడంతో పాటు, రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు.

Also Read:  Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!

మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమను ఈ ప్రభుత్వం పెట్టని ఇబ్బందంటూ లేదని మహిళా రైతులు భువనేశ్వరి వద్ద వాపోయారు. రాజధాని ఉద్యమానికి సహకరించి, రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు భువనేశ్వరికి గుర్తు చేశారు. మందడంలో రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నామన్న రైతులు.. రామకోటి రాసే పుస్తకాన్ని భువనేశ్వరికి అందించారు. రాజధాని రైతుల గొప్పదనం గురించి చంద్రబాబు త‌న‌తో ఎప్పుడూ అంటుండేవారని భువ‌నేశ్‌వ‌రి తెలిపారు. తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చారని చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవారు. మీ త్యాగాలు వృథాకావని తెలిపారు. మహిళల పట్ల అమానవీయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మహిళలు, రైతులను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా బయటకు వచ్చి పోరాడుతున్నారు.