AP Govt: నెట్వర్క్ ఆసుపత్రులకు(Network Hospitals) నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri Trust) వెల్లడించింది. ప్రస్తుతం రూ.203 కోట్లు విడుదల చేశామని, పెండిగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం తాత్కాలికంగా రూ.203 కోట్లు విడుదల చేసింది.