Old Woman House గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు.
గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునే ఒక వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బయటడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె ఇంట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం వచ్చింది. వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం, వెండి దొరకడం కలకలం రేపింది.
Police Ride Gold Silver And Cash Seized ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు, ఆభరణాలు ఎందుకున్నాయని పోలీసులు గురవమ్మను ప్రశ్నించారు. తన అల్లుడు వీటిని దాచుకున్నాడని చెప్పింది. తన అల్లుడు విజయవాడలో ఉంటాడని, భవానీపురంలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని ఆమె వివరించింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఇంత బంగారం ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా.. ఆ ఫ్యాక్టరీలో అతను భాగస్వామని.. చాలా ఆస్థిపరుడని గురవమ్మ తెలిపింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అతను పారిపోయాడు. ఆ బంగారం అతనిదేనా, లేక ఏదైనా పారిశ్రామికవేత్తలు అతన్ని బినామీగా వాడుకుంటున్నారా.. లేదా అక్రమ మార్గాల్లో సంపాదించాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
