ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సహకారం అందించడం జీవితంలో తాను చేసిన తప్పంటూ ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్. ఇప్పుడు సొంత బామ్మర్ది బ్రదర్ అనిల్(Brother Anil) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలపై చురకలేశారు. స్వార్థం కోసం ఇస్తోన్న ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దని దేవుడి (God)స్క్రిప్ట్ వేరేలా ఉందని జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆయన స్వతహాగా మత ప్రబోధకుడు. గత ఎన్నికల్లో ప్రార్థనా మందిరాలను కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గెలుపుకోసం మత ప్రాతిపదికన పావులు కదిపారు. ఇప్పుడే అదే బ్రదర్ అనిల్ (Brother Anil) శాపనార్థాలు పెడుతూ దేవుడి(God) స్క్రిఫ్ట్ వేరేలా ఉందని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
క్రిస్మస్ సందర్భంగా విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలంలోని ‘క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్’ ప్రోగ్రామ్ జరిగింది. దానికి హాజరైన బ్రదరల్ అనిల్(Brother Anil) ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని ప్రజలకు ప్రబోధించారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని గుర్తించుకోండని అక్కడికి వచ్చిన క్రిస్టియన్లకు సందేశం ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బ్రదర్ అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచిపోయినప్పటికీ ఎక్కడా వైసీపీ లీడర్లు నోరు తెరవలేదు. ఆయన వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి పేరుగానీ, వైఎస్సార్ సీపీ గురించిగానీ ప్రస్తావించకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చురకలు వేశారు. ఆ విషయం అక్కడ పాల్గొన్న వాళ్లకు బోధపడింది. గత ఏడాది కూడా బ్రదర్ అనిల్ పలు సందర్భాల్లో ఏపీలో జరిగిన క్రిస్టియన్ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆరా తీశారు. అసంతృప్తిగా ఉన్న వాళ్లతో భేటీ అయ్యారు. అవసరమైతే, ఏపీలోనూ కొత్త పార్టీని దింపడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.
స్వర్గీయ వైఎస్సార్ కు సన్నిహితునిగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ తో ప్రత్యేకంగా గత ఏడాది బ్రదల్ అనిల్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి ఇద్దరి మధ్యా చర్చకు వచ్చిందని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద తరచూ ఏదో ఒక రూపంలో పరోక్షంగా బ్రదర్ అనిల్ నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ ద్వారా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఆమె ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమనే సంకేతాలను కూడా ఒకానొక సందర్భంగా బ్రదర్ అనిల్ ఇచ్చిన విషయం విదితమే.
గత రెండేళ్లుగా వైఎస్ కుటుంబంలోని విభేదాలు పలు రకాలుగా బయటకు వచ్చాయి. అన్నా చెల్లెలు మధ్య ఆస్తుల పంపకం గురించి మనస్పర్థలు వచ్చాయని సర్వత్రా వినిపించే మాట. వాస్తవాలు ఎలా ఉన్నా, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం తరువాత అన్నా, చెల్లెలు మధ్యా మనస్పర్థలు ఉన్నాయని నమ్మేవాళ్లు ఎక్కువ. అంతేకాదు, వైఎస్ విజయమ్మ వైసీఆర్ సీపీ గౌరవాధ్యక్షరాలు పదవి నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలిన జీవితం షర్మిలతోనే అంటూ లోటస్ పాండ్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలను నడుపుతున్నారు. ఏపీతో ఏం పని అంటూ ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు విజయమ్మ స్పందించడం గమనిస్తే మనస్పర్థలు ఉన్నాయని అర్థం అవుతోంది.
ఇటీవల షర్మిలను తెలంగాణ ప్రభుత్వం పాదయాత్ర చేయకుండా అడ్డుకుంది. వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన రాద్దాంతం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంఘీభావం తెలపలేదు. పైగా ఆమె పాదయాత్ర వార్తలను సొంత మీడియా కవర్ చేయకుండా దూరంగా ఉంది. ఇవన్నీ అన్నా, చెల్లెలు మధ్య గొడవలు ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణలు. సాధారణంగా వైఎస్ జయంతి, వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సమేతంగా అందరూ ఒకటిగా కనిపిస్తారు. కానీ,గత రెండేళ్లుగా కుటుంబం అంతా ఒకటిగా కలిసిమెలసి ఉన్నట్టు కనిపించలేదు. ఇలాంటి తరుణంలో బ్రదల్ అనిల్(Brother Anil) ఏపీ రాజకీయాల వైపు తరచూ చూడడం సరికొత్త పరిణామానికి దారితీసేలా కనిపిస్తోంది. తాజాగా దేవుడి(God) స్క్రిఫ్ట్ వేరేలా ఉందని ఆయన సంకేతాలు ఇవ్వడం వైఎస్ కుటుంబం కథా చిత్రం క్లైమాక్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది.
CM Jagan : ఎన్నికలకు జగన్ రోడ్ మ్యాప్! 50 మంది ఓటర్లకు 2 వాలంటీర్లు!