79th Independence Day : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బటాలియన్ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు. విద్యార్థుల ప్రదర్శనలు, రాష్ట్ర పరిపాలనలోని రంగాల ఆధారంగా రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Read Also: 79th Independence Day : ఎర్రకోట పైనుంచి పాకిస్థాన్ కు ప్రధాని మోదీ హెచ్చరిక
విజయవాడ నగరవాసులు పెద్దఎత్తున హాజరై ఈ జాతీయ ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి తన వాహనంపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ దేశ భక్తి స్పూర్తిని ప్రదర్శించారు. పారేడ్తో పాటు స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమయం, దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రక దశ. ప్రపంచంలో అత్యంత శక్తిమంత దేశాల జాబితాలో మన భారతదేశం ప్రతిష్టాత్మక స్థానం సాధిస్తోంది. ఇలాంటి సమయంలో మనందరం దేశ సమగ్రత, భద్రత, ప్రగతికి ఏకమై కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ సందర్భంగా తన సందేశాన్ని రాష్ట్ర ప్రజలతో పంచుకుంటూ స్వతంత్రత అనేది వేలాది మహనీయుల త్యాగాల ఫలితం. మువ్వన్నెల జెండా గర్వంగా రెపరెపలాడుతున్న నేపథ్యంలో, ఆ త్యాగధనుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దేశం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఇది. ఉగ్రవాదాన్ని కూల్చివేయడంలో, దేశ భద్రతను రక్షించడంలో మన దేశానికి అపారమైన శక్తి ఉంది అని పేర్కొన్నారు.
అలాగే భారతదేశం ఈరోజు రక్షణ, అంతరిక్ష రంగాల్లో అంత్యంత అభివృద్ధి చెందింది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా కూడా బలపడుతూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత. దేశ సమగ్రతను కాపాడడంలో మనం ఐక్యతతో ముందడుగు వేయాలి. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, జాతీయ సమైక్యతను బలోపేతం చేద్దాం. జైహింద్! అని పవన్ కల్యాణ్ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. ఈ విధంగా విజయవాడ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్లో దేశభక్తి ఉత్కంఠను మరింత పెంచాయి. ప్రజల ఉత్సాహం, అధికారుల సమన్వయం, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనం అన్నీ కలగలిపి ఈ వేడుకలు మరపురాని దృశ్యాన్ని అందించాయి.