Site icon HashtagU Telugu

14 Died: చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన గుండెలు, రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి!

Chandrababu Case

Chandrababu Medical Test

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు అరెస్ట్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటనీ తీవ్ర మనస్థాపానిక గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. శనివారం, ఆదివారం ఆరుగురు గుండెపోటుతో చనిపోగా, ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్టు సమాచారం.

చనిపోయింది వీరే

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన టీడీపీ క్రియాశీల కార్యకర్త షేక్‌ హుసేన్‌ సాహెబ్‌ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తూ ఆవేదనతో కుప్పకూలిపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు సపవత్తు వాల్యనాయక్‌ గుండెపోటుకు గురై మృతి చెందారు. వైయస్‌ఆర్‌ జిల్లా రాజుపాళెం మండలం కుమ్మరిపల్లెకు చెందిన పదముత్తం ఏసన్న చంద్రబాబు రిమాండు విషయం తెలుసుకుని అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు రైతు నలదల సుబ్బారావు గుండెపోటుతో మరణించారు.

ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన వాయుల సుందరరావు (28) ఆదివారం (సెప్టెంబర్ 10) ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మపురం టీడీపీ నాయకుడు వడ్డే ఆంజనేయులు (65) శనివారం ఉదయం టీవీలో చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను చూసి గుండెపోటుతో మృతి చెందారు.

డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్లుబోయిన నరసింహరావు (62).. టీవీల్లో చంద్రబాబు అరెస్టు వార్తలు చూస్తూ కలత చెంది, గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కోనసీమ జిల్లాకు చెందిన కాకర సుగుణమ్మ (65)గుండెపోటుతో మృతి చెందారు.

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం జిన్నాంకు చెందిన టీడీపీ కార్యకర్త ఇజ్జిరోతు పైడితల్లి (67) గుండెనొప్పితో మరణించారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటరమణ (46)కు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. చంద్రబాబు అరెస్టు వార్తలను టీవీలో చూస్తూ.. కలత చెంది గుండెపోటుతో కుప్పకూలారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన కొడాలి సుధాకరరావు (60) చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 14 మంది చనిపోయినట్టు టీడీపీ అధికార ప్రకటనలో తెలిపింది.

Also Read: Ravi Teja’s Production: రవితేజ ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్ రిలీజ్, థ్రిల్లింగ్ అండ్ ఫుల్ ఫన్