Rajya Sabha: రాజ్య ముద్ర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..!

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 06:32 AM IST

Rajya Sabha: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 214 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఓట్లు పడలేదు. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లులో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధన పెట్టారు. బిల్లును ఆమోదించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రధాని మోదీని అభినందిస్తున్నాను అన్నారు.

ఈ బిల్లును ఆమోదించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది నిర్ణయాత్మక ఘట్టమని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు. నారీ శక్తి వందన్ చట్టానికి ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ఏకగ్రీవ మద్దతు నిజంగా హృదయపూర్వకమైనది. దీనితో మేము భారతదేశంలోని మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత శకాన్ని ప్రారంభిస్తాము. ఈ చారిత్రాత్మక అడుగు వారి గొంతులను మరింత సమర్థవంతంగా వినిపించేలా నిబద్ధతతో ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించినదని, ఇది చట్టంగా మారిన తర్వాత 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత మహిళా సభ్యుల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని చెప్పారు. అలాగే, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి అన్నారు.

Also Read: F-35 Fighter: అమెరికా F-35 యుద్ధవిమానం ప్రత్యేకతలు

దీని కింద ఎస్సీ-ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు వస్తాయని తెలిపారు. అందువల్ల జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ముఖ్యమైనవి. బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరుగుతాయి. ఇది రాజ్యాంగ ప్రక్రియ. మహిళలకు ఏయే సీట్లు రావాలో డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.

రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్‌కు ముందు, ఈ బిల్లు దేశ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని పెంపొందించడంలో సభ్యులు, రాజకీయ పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. బిల్లు ఆమోదం పొందడం వల్లనే మహిళా శక్తికి ప్రత్యేక గౌరవం లభిస్తోంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఆలోచించడం మన దేశ మహిళా శక్తికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మోదీ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఆరోపణలు

చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2014లో మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని అన్నారు. బిల్లు తీసుకురావడానికి మీకు 9 ఏళ్లు ఎందుకు పట్టింది, ఎవరు ఆపారు? కొత్త పార్లమెంట్‌కు రావడానికి ప్రధాని మోదీ ఎదురు చూస్తున్నారా, పాత పార్లమెంట్‌లో ఏదైనా వాస్తు దోషం ఉందా..? ఇప్పుడు బిల్లు తెచ్చి 2029లో అమలు చేస్తామంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనం మొదటి సెషన్‌లో రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ బీజేపీని టార్గెట్ చేశారు.