టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు. చముంపు ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. మంత్రి ఆర్కే రోజా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని వ్యక్తి ముంపు ప్రాంతాలను జిల్లాలుగా ఎలా మారుస్తారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా అప్పులు చేశారని ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వంలో నగదు కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయలేని చంద్రబాబు ముంపు గ్రామాలను జిల్లా చేయడం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు.