MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు

  • Written By:
  • Updated On - February 10, 2024 / 05:56 PM IST

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతామని అంటున్నది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందని తేల్చిచెప్పారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్ లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 18 వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందని అన్నారు.

శనివారం నాడు శాసన మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మధ్యంతర బడ్జెట్ లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు. కేటాయింపులు ముఖ్యం కాదని, ప్రభుత్వ ధృక్పథం బడ్జెట్ ను సూచిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు.

మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమాంలకు, మోజమ్లకు రూ. 10 వేలు ఇస్తామని, పిల్లల కోసం తౌఫే తాలిమ్ ను మొదలుపెడుతామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో చేర్చి బడ్జెట్ లో విస్మరించిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో చెప్పిన సూక్ష్మ స్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా, కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్తు కోత లేకపోయేదని, కానీ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే ప్రతి రోజూ 3-4 గంటల పాటు కరెంటు పోతుందని విమర్శించారు.