UP Politics: ఎన్నికల ఎజెండా నిర్దేశించడంలో బీజేపీ విఫలం

ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ... ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి విఫలమైందనే చెప్పాలి. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది.

  • Written By:
  • Updated On - January 16, 2022 / 10:28 AM IST

ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ… ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి విఫలమైందనే చెప్పాలి. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. జాతి గౌరవం, దేశ భద్రత, అవినీతి, సాంస్కృతిక జాతీయ వాదం, హిందుత్వం, రామ మందిరం వంటి అంశాలతో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలను ఎదుర్కొంది. గెలుపోటములను పక్కనపెడితే, బీజేపీ ఎన్నికల ఎజెండాపై ఎలా స్పందించాలో తెలియక రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండా ను ఎదుర్కొనే క్రమంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, మమతా బెనర్జీ వంటి నేతలు ఆలయాల చుట్టూ పరుగులు తీస్తూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అలాంటి కమలదళం జాతీయ రాజకీయ గమనాన్ని నిర్ణయించగలిగే ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాదు, మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎజెండాను నిర్దేశించలేకపోతోంది.

షెడ్యూల్‌ ప్రకటించక ముందు పైచేయి..

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు వరకు ప్రచారంలో భారతీయ జనతా పార్టీదే పైచేయిగా కనిపించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా బీజేపీ అగ్ర నేతలు పలు ప్రచార కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శించారు. అయోధ్య రామ మందిరం, కాశీ కారిడార్, మథుర శ్రీకృష్ణ జన్మస్థాన్ గురించి కమలదళ నాయకులు పదే పదే మాట్లాడారు. పూర్తిచేసిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టుల శంఖుస్థాపనలను చాలా అట్టహాసంగా చేస్తూ తమది కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని ఘనంగా చాటుకున్నారు. మొత్తంగా హిందుత్వ భావోద్వేగాన్ని ముడిసరుకుగా మార్చుకుని కులాలకు అతీతంగా హిందువులలోని అన్ని వర్గాల ఓట్లను పొందాలన్న ప్రయత్నం చేశారు.

నిజం చెప్పాలంటే 90వ దశకం తొలినాళ్ల నుంచి అయోధ్య రామమందిర అంశం ప్రతి ఎన్నికల్లోనూ అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది. పార్టీ గెలిచినా, ఓడినా ఈ నినాదాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అయితే నినాదాన్ని నిజం చేస్తూ మందిర నిర్మాణ పనులు చకచకా జరుగుతున్న సమయంలో… ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. నిజానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని సైతం అయోధ్యకు మార్చి ఊపు తెద్దామని భావించిన బీజేపీ నేతలు, చివరకు ఆయన సొంత ఇలాఖా గోరఖ్‌పూర్‌కే పరిమితం చేయాల్సి వచ్చింది. అప్పుడైతేనే యోగి మిగతా అన్ని నియోజకవర్గాలపై దృష్టి పెట్టడానికి వీలుపడుతుందని, లేదంటే మారిన స్థానంలో ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అగ్రనాయకత్వం భావించింది. అయితే దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. యోగిని అప్పుడే ఇంటికి పంపించేశారంటూ ఎద్దేవా చేశారు.

ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు…

ఎన్నకల వేళ అసంతృప్తు నేతలు పార్టీలు మారడం షరా మామూలే.. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు ఏమీ కాదు. కాకపోతే ఏకంగా కేబినెట్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు పెద్ద నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీని వీడడం, వీడినవారు తమ ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ క్యాంపులో చేరడం బీజేపీ ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యోగి కొలువులో మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీలు మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు బీజేపీ నిర్దేశించిన రామమందిరం, కాశీ కారిడార్, మథుర శ్రీకృష్ణ జన్మస్థాన్ గురించి జరిగిన చర్చ కాస్తా భారతీ జనతా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న అంశాలపైకి దారిమళ్లింది. పార్టీలోనూ ఆత్మపరిశీలన, పోస్టుమార్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కమళదళాన్ని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే, ఇటువంటి పరిణామాలు సృష్టించిన ప్రతికూల రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ ఎదురొడ్డి పోరాడాల్సి ఉంటుంది.

గట్టిగా దెబ్బకొట్టిన రైతు ఆందోళనలు..
ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ వారు తమ సొంత పార్టీగా భావించే రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్ఎల్డీ)ను కాదని, గత ఎన్నికల్లో జాట్లు బీజేపీ వెంట పరుగులు తీశారు. ఇందుకు ముజఫర్‌నగర్ అల్లర్లు సైతం దోహదపడ్డాయి. ఈ అల్లర్లతో ఏర్పడ్డ జాట్-ముస్లిం విభజన బీజేపీకి లబ్ది చేకూర్చింది. అయితే ఈ అభిమానం రైతు ఆందోళనలతో ఒక్కసారిగా తలకిందులైందనే చెప్పాలి. అత్యధిక శాతం వ్యవసాయదారులైన జాట్లు, బీజేపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. “ఆధి రోటీ ఖాయేంగే, బీజేపీకో జితాయేంగే” (తినేందుకు సగం రొట్టెలు దొరికినా చాలు, బీజేపీకి ఓటేస్తాం) అనే నినాదాలు గతంలో జాట్ల నుంచి వినిపించగా, ప్రస్తుతం రోజువారీ రొట్టెలు సంపాదించడమే సమస్యగా మారిందని జాట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపోటములను నిర్దేశించేవి కుల సమీకరణలే ..

2017లో జరిగిన ఎన్నికల్లో కులాల గోడలు దాటి అన్ని వర్గాల ప్రజలు కాషాయ పార్టీకి ఓటేసినట్టు కనిపించినా, జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు కూడా కుల సమీకరణాలే ఆ పార్టీని గెలిపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 2017లో బీజేపీ కి అనుకూలించిన అంశాల్లో అనేక కులాలను బీజేపీ వెంట నడిచేలా చేయడంలో ఆయా కుల పార్టీలతో కూటమి కట్టడంలో, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి బలమైన ఓబీసీ నేతలు ఎంతగానో లాభించిన అంశాలు. అయితే ఇప్పుడు వివిధ కుల సంఘాల నాయకులను, వెనుకబడిన కులాలు, దళితులకు ప్రాతినిధ్యం వహించే చిన్న పార్టీలతో సమాజ్‌వాదీ జతకట్టింది. ఇది ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యూపీలో బీజేపీకి ఎదురుగాలి….

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసిన కొంతమంది నేతలు… ప్రస్తుతం ఆ పార్టీని వీడుతున్నారు. అయితే ముందునుంచి బీజేపీలో ఉన్నవారు మాత్రం ఆ పార్టీలోనే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కాషాయ పార్టీలో చేరిన నేతలు మాత్రమే మళ్లీ నిష్క్రమిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకుంటే… గతంలో తమ తమ కులాల ఓట్లను బీజేపీకి జతకలపడంలో కీలకంగా వ్యవహరించిన మౌర్య, సైనీ, ధారాసింగ్ చౌహాన్ వంటి మంత్రులు ప్రస్తుతానికి పార్టీని వీడారు. ఈ ఓట్లు ఇప్పుడు సమాజ్‌వాదీవైపు తిప్పుకోగలిగితే బీజేపీకి తీవ్ర ఇబ్బందులు తప్పవు. కులాల గోడలు దాటని ఉత్తర్ ప్రదేశ్ సమాజాన్ని, హిందుత్వ భావోద్వేగంతో కలిపి ఒక గొడుగు కిందకు తీసుకురావడం అంత సులభం కాదని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు ఇప్పటికే అర్థమైంది. ఈ దశలో ఏ ఎజెండాను నిర్దేశించ లేక, ప్రత్యర్థి నిర్దేశించిన ఎజెండా వెంట పరుగులు తీస్తోంది. ఇది ఎంతమాత్రం బీజేపీ కి కలిసివచ్చే అంశం కాదనే చెప్పాలి.