ఏపీ ప్రభుత్వం తొలి ఏడాది అట్టహాసంగా సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికి పథకాలు అందించారు. అయితే రాష్ట్ర అర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో ఇప్పడు సంక్షేమ పథకాలపై ఆంక్షలు కఠినతరం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా అమ్మవడిలో కోతలు విధించగా.. తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకంలో కూడా ఆంక్షలు విధించింది. చేయూత పథక లబ్ధిదారులకు విద్యుత్తు షాక్ తగలనుంది. ఆరు నెలల సరాసరి 300 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం నిబంధన పెట్టనున్నారని సమాచారం. ఈ నిబంధనతో చాలా మంది అనర్హులుగా మారబోతున్నారు. ఎక్కువ విద్యుత్తును వినియోగించారనే కారణంతో ఈ దఫా చాలా మంది లబ్ధిదారుల్ని ప్రభుత్వం పునఃపరిశీలన జాబితాలో చేర్చింది. చేయూత పథకం కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న SC, ST, BC, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున నాలుగేళ్లకు 75 వేలు ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని అందించగా…… వచ్చే నెల 22వ తేదీన మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. గతేడాది రెండో విడత కింద 23.14 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని అందించారు.