Wages Hike Vs Jail : తమ దగ్గర పనిచేస్తున్న వారికి శాలరీలను పెంచడమే వారు చేసిన పాపమైంది. ఉద్యోగులకు శాలరీలను పెంచిన కొందరు దుకాణదారులను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ అరుదైన ఘటన మయన్మార్ దేశంలో చోటుచేసుకుంది. అక్కడి సైనిక ప్రభుత్వం ఈ వింత నిబంధనను అమలు చేస్తూ దుకాణదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శాలరీలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూసే మయన్మార్ చిరు ఉద్యోగులు ఈ పరిణామాలతో భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఉద్యోగులకు శాలరీ పెంచారని ఇప్పటివరకు దాదాపు 10 మంది దుకాణదారులకు అరెస్టు చేసి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. వారి వ్యాపారాలను కూడా బలవంతంగా మూయించారు. వాస్తవానికి మయన్మార్లో ఉద్యోగులకు వేతనాలను పెంచొచ్చు. కానీ ప్రస్తుతం ఆ దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం ఉంది. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. ఈ తరుణంలో ఉద్యోగులకు శాలరీలను పెంచితే సమాజంలో అశాంతి నెలకొంటుందనే అభిప్రాయంతో మయన్మార్(Wages Hike Vs Jail) సైనిక ప్రభుత్వం ఉంది. తమ ఆలోచనను అమలు చేసే క్రమంలోనే శాలరీలను పెంచే దుకాణదారులను అరెస్టు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది.
ఉద్యోగులకు శాలరీలను ప్రస్తుతానికి పెంచొద్దంటూ అన్ని దుకాణాల ఎదుట నోటీసులను పెట్టించింది. ఒకవేళ ఎవరైనా దుకాణదారులు ఉద్యోగుల శాలరీలు పెంచితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లుగా పరిగణించి అరెస్టు చేస్తామని సైన్యం ప్రకటించింది. 2021 వరకు మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఉండేది. అయితే ఆ ఏడాది సైన్యం తిరుగుబాటు చేసి ప్రజానేత ఆంగ్సాన్ సూకీని గద్దె దింపింది. ప్రస్తుతం సైనిక ప్రభుత్వం కూడా సుస్థిరంగా లేదు. దేశ ప్రజలు మిలిటెంట్ గ్రూపులుగా విడిపోయి.. సైన్యంతో ఎక్కడికక్కడ తీవ్ర పోరాటం చేస్తున్నారు.
మయన్మార్లో నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు శాలరీలను పెంచితే.. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోళ్లు ఎక్కువగా జరిగితే ఆర్థిక వ్యవస్థ ప్రగతి వేగాన్ని పుంజుకుంటుంది. వెరిసి దేశంలోని వివిధ రంగాలు ముందుకు దూసుకుపోతాయి. ఈ లాజిక్ను మర్చిపోయి మయన్మార్ సైనిక సర్కారు మూర్ఖంగా ప్రవర్తిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.