Koo App: మేడిన్ ఇండియా సోషల్ మీడియా యాప్ ‘కూ’ ప్రస్థానం ఇక ముగిసింది. తన కార్యకలాపాలను కూ ఆపేసింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్లో ఓ పోస్ట్ చేశారు. డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో కూ యాప్ విక్రయానికి సంప్రదింపులు జరిపినా.. అవి సఫలం కాలేదని ఆయన వెల్లడించారు. ‘‘స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ కూ యాప్ నడిచింది. ఓ దశలో కూ యాప్లో 21 లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. తన నాలుగేళ్ల ప్రయాణంలో ‘కూ’ అనేక ఎత్తుపల్లాలను చూసింది. లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్ బై చెప్తోంది’’ అంటూ తన లింక్డిన్ పోస్ట్లో రాధాకృష్ణ(Koo App) పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి 2019లో ప్రారంభించిన కూ యాప్.. ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ కేవలం ఐదేళ్లలోనే దాని ప్రస్థానానికి తెరపడింది. ఢిల్లీ వేదికగా రైతు ఉద్యమం జరిగిన టైంలో సోషల్ మీడియా అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విటర్తో కేంద్రానికి ఘర్షణ జరిగింది. దీంతో అప్పట్లో కీలక ప్రత్యామ్నాయంగా కూ యాప్ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో స్వయంగా కేంద్రమంత్రులే కూ యాప్ను ప్రమోట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఆ పరిణామాలు ట్విట్టర్(ఎక్స్) పెద్ద షాక్ ఇచ్చాయి. ఆ పరిణామాలతో అప్పట్లో కూ యాప్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. నైజీరియా, బ్రెజిల్ దేశాలకూ తన కార్యకలాపాలను కూ యాప్ విస్తరించింది. తదుపరిగా ఈ కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఎదురైంది. ఈక్రమంలోనే ఈ ఏడాది ఎంతోమంది ఉద్యోగులను తొలగించింది.