మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ నాయకుడు ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దుర్గి లో ఎన్టీఆర్ విగ్రహం పై దాడి చేసిన వ్యక్తి పై వెంటనే కేసు నమోదు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. సంఘటన జరిగిన రెండు గంటల్లోనే ముద్దాయి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఈ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దుర్గి లో 144 సెక్షన్ అమలు లో ఉందని ఎస్పీ తెలిపారు.