Internet Cables Cut : యెమన్ దేశానికి చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ అమానవీయ దాడులను ఆపకుంటే ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తూ వచ్చిన హౌతీలు.. చెప్పినంత పని చేసినట్టుగా తెలుస్తోంది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు కీలకమైన సముద్రగర్భ కేబుళ్లలో నాలుగు ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే ఇది హౌతీ రెబల్స్ పనేనా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్ అయిన కేబుళ్లలో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవే అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుళ్లపై హౌతీలు దాడులు మొదలుపెట్టారనే అనుమానాలు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఎర్ర సముద్రంలో హౌతీలు కట్ చేసినట్టుగా(Internet Cables Cut) చెప్పుకుంటున్న కేబుల్స్ వివరాలను ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.. ‘ఏఏఈ-1 కేబుల్’ తూర్పు ఆసియా ప్రాంతాన్ని ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో లింక్ చేస్తుంది. చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది. యూరప్ ఇండియా గేట్వే (ఈఐజీ) కేబుల్.. దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది. ఇక సీకామ్ కేబుల్.. ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి.టీజీఎన్-ఈఏ కేబుల్.. ఇది 9,280 కిలో మీటర్ల పొడవైన అండసీ కేబుల్ సిస్టమ్. ఇది భారత్లోని ముంబయిని ఫ్రాన్స్లోని మార్సెయిల్తో కలుపుతూ, ఈజిప్ట్ మీదుగా వెళుతుంది.