Hamsa Nandhini : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా ?

ప్రముఖ నటి హంసా నందిని రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి సుదీర్ఘమైన పోస్టు ద్వారా వివరించారు.

  • Written By:
  • Updated On - December 21, 2021 / 01:57 PM IST

ప్రముఖ నటి హంసా నందిని రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి సుదీర్ఘమైన పోస్టు ద్వారా వివరించారు. ఆమెకొచ్చిన క్యాన్సర్ జన్యుపరమైన మ్యుటేషన్‌తో కూడుకుని ఉండటం వల్ల చికిత్స పూర్తయిన తర్వాత కూడా 70% వరకు క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

క్యాన్సర్ అంటే ఏంటి?

నియంత్రణ లేకుండా కణ విభజన జరిగినప్పుడు క్యాన్సర్ సోకుతుంది. కణ విభజనపై శరీరం నియంత్రణ కోల్పోగానే అది క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. శరీరంలో కణ విభజనను నియంత్రణ చేయడానికి ట్యూమర్ సప్రెస్డ్ జన్యువులు ఉంటాయి. ఇవి నియంత్రణ కోల్పోయినప్పుడు క్యాన్సర్ సోకుతుందని వివరించారు. క్యాన్సర్‌లలో రొమ్ము, పొట్ట, పెద్ద పేగు, అండాశయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ల లాంటివి అనేక రకాలుంటాయి. భారత మహిళల్లో అత్యధికంగా వచ్చే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి.

రొమ్ము క్యాన్సర్ సోకినట్లు కనిపెట్టడం ఎలా?

వ్యాధి లక్షణాలు లేకుండా వ్యాధి ఉందో లేదో చూసుకునే ప్రక్రియను స్క్రీనింగ్ అంటారు. రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టేందుకు చేసే స్క్రీనింగ్ పరీక్షను మామోగ్రామ్ అంటారు. రొమ్ము ఆకారంలో, పరిమాణంలో మార్పులు, రొమ్ము బాగా కుంచించుకుపోయినా, చను మొనల నుంచి రక్తం లేదా ఇతర రంగులో ఉన్న ద్రవం లాంటిది వస్తున్నా, దద్దుర్లు వచ్చినా, చర్మం రంగులో తేడా వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్ళు పైబడిన మహిళలందరూ ఈ మామోగ్రామ్ పరీక్ష రెండేళ్ల కొకసారి చేయించుకోవడం మంచిది.

క్యాన్సర్ రావడానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యత, హార్మోన్ల ప్రభావం కూడా కారణం కావచ్చని నిపుణులు ఆనుతున్నారు. భారతదేశంలో ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఎక్కువని, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు తక్కువని, కానీ, వాటిలో ఎక్కువగా రొమ్ము, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి.

జన్యుపరమైన మ్యుటేషన్ అంటే ఏంటి?

మన శరీరంలో అనేక రకమైన జన్యువులుంటాయి. వాటిలో జరిగే మార్పులను మ్యుటేషన్ అంటారు. రొమ్ము క్యాన్సర్ సోకిన రోగి శరీరంలో బిఆర్‌సి‌ఏ 1,2 జన్యువులలో మార్పులు ఉంటే, దానిని వంశపారంపర్యంగా వచ్చిన క్యాన్సర్ గా గుర్తిస్తారు. బిఆర్‌సిఏ 1,2 జన్యుపరమైన మ్యుటేషన్లు ఉన్నట్లు తెలిస్తే, 60 నుంచి 80 శాతం రొమ్ము క్యాన్సర్, 30 – 45 శాతం అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ 100 మందికి క్యాన్సర్ సోకితే అందులో 5 – 10% వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు.. అయితే, భారతదేశంలో వంశపారంపర్య క్యాన్సర్ వచ్చే అవకాశాలు తెలుసుకునేందుకు అవసరమైన వనరులు లేకపోవడంతో తగినంత డేటా అందుబాటులో లేదు.

ఈ పరీక్షలను క్యాన్సర్ సోకిన రోగులందరికీ చేస్తారా?

ఈ పరీక్షలను క్యాన్సర్ సోకిన రోగులందరికీ చేయవలసిన అవసరం లేదని చెబుతూ, రోగికి మామోగ్రామ్ పరీక్షలో రొమ్ము క్యాన్సర్ అని తెలిసిన తర్వాత, బయాప్సి, ఇతర పరీక్షల ఆధారంగా చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఈ దశలోనే రోగి వయసు, క్యాన్సర్ రకం, దశతో పాటు రోగి కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం అవసరం. రోగి ఫస్ట్ డిగ్రీ బంధువులు ( తల్లి, చెల్లి, తండ్రి, అక్క, కూతురు), మేనత్త లాంటి వారు సెకండ్ డిగ్రీ బంధువుల ఆరోగ్య చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకుని జన్యుపరమైన పరీక్షలు చేయాలా వద్దా అని నిర్ధరిస్తారు.

జన్యు పరీక్షలు చేయాలంటే రూ. 20,000 – రూ. 70,000 వరకు అవ్వచ్చు. అందుకు ప్రతీ ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహించలేం. ఇందుకు జెనెటిక్ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలు, కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టీ ఈ పరీక్షలు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.

నటి హంస నందిని తన పోస్టులో ఆమె తల్లి కూడా క్యాన్సర్ సోకి మరణించినట్లు తెలిపారు.

బిఆర్‌సి‌ఏ 1, 2 జన్యువులు ఉన్న వారికి రెండు రొమ్ములు, రెండు అండాశయాలు తొలగించడం మేలు అని చెప్పారు. ప్రాథమిక దశలో గుర్తించిన క్యాన్సర్ శరీరంలో మిగిలిన భాగాలకు పాకకుండా ఉంటే క్యాన్సర్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.

క్యాన్సర్ జయించానని చెప్పుకోవడానికంటే ముందు సుదీర్ఘమైన, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుందని కూడా తన పోస్టులో చెప్పారు. లంపెక్టమీ, కిమోథెరపీతో తన చికిత్స పూర్తయినట్లు కాదని, పూర్తి స్థాయిలో క్యాన్సర్ తో పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే 9 విడతల కిమోథెరపీ పూర్తి కాగా, మరో 7 విడతల కిమో చికిత్స ఉన్నట్లు ఆమె చెప్పారు.హంస నందిని పోస్టులో “ఈ రోగం నా జీవితాన్ని శాసించకూడదని, నవ్వుతూ దీనితో పోరాడి గెలుస్తానని, మరింత శక్తితో స్క్రీన్ పైకి వస్తాను” అని చెప్పారు.

“జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా, అన్యాయంగా అనిపించినా కూడా నేను బాధితురాలిగా ఉండాలని అనుకోవడం లేదు. భయం, ప్రతికూలతలను నా జీవితాన్ని ప్రభావితం చేయనివ్వకుండా నేను పోరాడుతాను. ప్రేమ, ధైర్యంతో ముందుకు సాగుతాను” అంటూ ట్వీట్ చేశారు. తన కథను పది మందికీ చెప్పడం ద్వారా క్యాన్సర్ గురించి మరింత మందికి అవగాహన కల్పిస్తానని పోస్టులో పేర్కొన్నారు. నేను జీవితం అందించే ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తానని పోస్టును ముగించారు.

ఎర్లీ స్క్రీనింగ్ మాత్రమే క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గం.