Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ ఇక లేరు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈవిషయాన్ని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా డి. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆయన మంచంపట్టారు. హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స జరిగింది. ఈక్రమంలోనే ఇవాళ డీఎస్(Dharmapuri Srinivas) తుదిశ్వాస విడిచారు.
We’re now on WhatsApp. Click to Join
డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా సేవలు అందించారు. 2013 నుంచి 2015 శాసనమండలి సభ్యునిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై డీఎస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఆయన 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహరాల సలహాదారుగా డీఎస్ పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైంలోనే ఆయన చాలా విషయాల్లో టీఆర్ఎస్తో విభేదించారు. ఈనేపథ్యంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
- డి. శ్రీనివాస్ రెండో కుమారుడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. అర్వింద్ 2019లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా అర్వింద్ ఎన్నికయ్యారు.
- డి.శ్రీనివాస్ పెద్దకుమారుడు సంజయ్. ఈయన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
డీఎస్ కెరీర్ గ్రాఫ్
- డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు.
- డీఎస్ రాజకీయ గురువు ఆర్గుల్ రాజారాం.
- నిజాం కళాశాలలో డీఎస్ చదువుకున్నారు.
- కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడిగా డీఎస్ రాజకీయ ప్రవేశం చేశారు.
- 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా డీఎస్ గెలిచారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ సేవలందించారు.
- 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా పనిచేశారు.
- 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
- 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రియాశీలక పాత్ర పోషించారు.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో డీఎస్ ముఖ్య పాత్ర పోషించారు. నాడు వైఎస్ తో కలిసి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో సోనియా గాంధీకి విధేయుడిగా డీఎస్ గుర్తింపు తెచ్చుకున్నారు.
- ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో డీఎస్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి.