KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెట‌ర్‌.. లేఖ‌లో ఏం రాశారో తెలుసా

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:

  • Written By:
  • Updated On - March 23, 2022 / 10:30 PM IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:

• మన దేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవనాన్ని సాగిస్తున్నారనే విషయం మీకు తెలిసిందే.

• ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాల వృద్ధికి, ముడిసరకులు, వినియోగ వస్తువులు- సేవల సరఫరాదారుగా రెండు రకాలుగా వ్యవసాయరంగం దోహదం చేస్తున్నది. ఈ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తున్నది.

• ఈ రంగానికున్న ప్రాధాన్యత దృష్ట్యా వ్యవసాయరంగం స్థిరమైన, అధిక వృద్దిరేటును సాధించడానికి ప్రగతశీలమైన, స్థిరమైన, రైతు అనుకూల విధానాలను మేము అనుసరిస్తున్నాం.

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారులకు మద్దతునివ్వాల్సిన అంశాల్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ అత్యంత ప్రాధాన్యమైనది.

• ప్రభుత్వం దేశం మొత్తం మీద అన్ని రకాల ధాన్యాలకు వర్తించే విధంగా, ఏకరీతి జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలి

• అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ధాన్య సేకరణ విధానం చట్టబద్ధతను కలిగి ఉండాలి

• ఏదేమైనప్పటికీ, దేశవ్యాప్తంగా ఏకరీతి ధాన్య సేకరణ విధానం లేదనే విషయాన్ని నేను మీకు నిర్బంధంగా గుర్తు చేయదలుచుకున్నాను.

• ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేయదగిన మిగులు ధాన్యం, గోధుమలన్నింటినీ సేకరిస్తున్నది. కానీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరించటం లేదు.

• దేశంలో ఉండే వేర్వేరు రాష్ట్రాలకు ఇలా వేర్వేరు విధానాలుండకూడదు.

• మీరు వ్యవసాయ నిపుణులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, చర్చించి దేశ అవసరాలకు అనువుగా ఉండే జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.

• భారత ప్రభుత్వం అనుసరిస్తున్న అస్థిరమైన, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్రమైన విసుగును, అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

• భారత ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో గత రెండేళ్ళ కాలంగా రైతుల ఆగ్రహాన్ని దేశం చవి చూసింది. ఈ చట్టాలతో రైతుల్లో నిస్సాహాయత, ఆగ్రహం ప్రజ్వరిల్లింది.

• రైతుల ఆగ్రహజ్వాలలకు ప్రభుత్వం తలవంచి రైతు చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదు.

• పార్లమెంటు ఆమోదించిన జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలు భారత ప్రభుత్వం బాధ్యత.

• రాష్ట్ర ప్రభుత్వాలకు నిల్వ సామర్థ్యం, ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర తరలింపు సౌకర్యాలు లేవు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 మేరకు దేశవ్యాప్తంగా ధాన్య సేకరణ, సరఫరా బాధ్యత భారత ప్రభుత్వానిదే.

• తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అందించిన ప్రోత్సాహకాలు, మౌలిక సౌకర్యాల కల్పన వంటి వాటి కారణంగా వ్యవసాయరంగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

• తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక వృద్ధిరేటు నమోదై రైతుల ఆత్మహత్యలు, వలసలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

• కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థల అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ధాన్యం మొత్తాన్ని సేకరించాలి.

• కావున భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్న మిగులు ధాన్యాన్ని సేకరించాల్సిందే

• గతంలో ఇదే ఆనవాయితీ ఉన్నప్పటికీ, గత రెండేళ్ళుగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ వరి ధాన్యాన్ని సేకరించేందుకు విముఖత ప్రదర్శిస్తున్నదనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.

• జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం మద్దతు ధర కల్పించడంతో పాటు దాన్ని అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత

• పంటల వైవిధ్యం అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పత్తి, కందులు, పామాయిల్ సాగును విస్తరించేందుకు, తదనుగుణంగా రైతులను ప్రోత్సహించేందుకు ఎన్నో క్రియాశీలక చర్యలను చేపట్టింది.

• తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా 2021 రబీ సీజన్ లో 52 లక్షల ఎకరాలున్న వరి సాగు 2022 రబీ సీజన్ లో 36 లక్షల ఎకరాలకు తగ్గింది.

• పంటల నియంత్రితసాగు వాంఛనీయ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి దాకా ఓ వైపు పంటల నియంత్రితసాగు కోసం తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూనే, మరోవైపు మిగులు వరి ధాన్యాన్ని ఎలాంటి పరిమితులతో కూడిన నిబంధనలు లేకుండా సేకరిస్తాం.

• ప్రస్తుత రబీ సీజన్ లో మార్కెటింగ్ చేయదగిన మిగులు వరి ధాన్యం మొత్తం సేకరించేలా ఆహార మంత్రిత్వ శాఖను ఆదేశించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. లేదంటే తెలంగాణలో వరిని సాగు చేసే రైతులకు సంబంధించి మద్దతు ధర అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. ఇది వ్యవసాయరంగం పై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో పాటు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావాన్ని చూపి జాతీయ ఆహార భద్రత చట్టం లక్ష్యాలను నీరుగారుస్తుంది.