బ్రిటన్ రాణి ఎలిజబెత్2 ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆమె కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రంపై సర్వత్రా చర్చ మొదలైంది. దాన్ని తిరిగి భారత్ కు రప్పించడం అసాధ్యమే అనే కోణంలో డిబేట్ జరుగుతోంది. ఇక కోహినూర్ వజ్రం మూలాలపైనా అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. కోహినూర్ వజ్రం వరంగల్ లోని భద్రకాళి ఆలయంలోనే ఉండేదని చరిత్ర నిపుణులు వాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉంది.
దీన్ని క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేసి నిర్మించాడు. ఇందులో ప్రధాన దేవత అయిన భద్రకాళీ అమ్మవారు పెద కళ్లు, గంభీర ముఖం, ఎనిమిది చేతులు, చేతులకు వేరు వేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చుని ఉంటారు. చాళుక్య రాజవంశం తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారని పలువురు చరిత్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వజ్రాన్ని గుంటూరులోని కొల్లూర్ గనుల్లో(గోల్కొండ గనులు) వెలికి తీశారని అంచనా వేస్తున్నారు.
మాలిక్ కాఫర్ దండయాత్రలో..
క్రీస్తు శకం 1310 కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యంపైకి దండయాత్ర చేశాడు. ఆ సమయంలో భద్రకాళీ ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడి చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అనంతరం మొగల్ రాజుల నెమలి సింహాసనం పైన దీన్ని పొదిగారు. మొగల్ సామ్రాజ్యం కూలిన తర్వాత దేశంలోని ఒక్క ప్రాంతం క్రమంగా బ్రిటీష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. కొన్ని రాజ సంస్థానాల వాళ్ళు బ్రిటీష్ వాళ్లకు కప్పం కట్టి.. బ్రిటన్ మహారాణికి సామంత రాజుల్లాగా మారిపోయారు. 1849 ఫిబ్రవరి1న రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో బ్రిటీష్ వాళ్ళు గెలిచారు.సిక్కు రాజులు ఓడిపోయారు. 1949 ఏప్రిల్ 2న పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటీష్ ఇండియాలో చేర్చుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రకటన చేసింది.
11 ఏళ్ల దులీప్ సింగ్ ను పంజాబ్ చక్రవర్తి గా నియమించింది. అతడు గద్దెను ఎక్కిన తర్వాత.. సిక్కు రాజ్యం ఆధీనంలోని విలువైన వజ్ర వైడూర్యాల లెక్కను తీసే ప్రక్రియను తెల్ల దొరలు స్టార్ట్ చేశారు. ఈక్రమంలో సిక్కు పాలకుడు దులీప్ సింగ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొని లండన్ లో 1851 సంవత్సరం లో వేలానికి పెట్టింది. ప్రిన్స్ అల్బర్ట్, క్వీన్ విక్టోరియా దీన్ని వేలంలో దక్కించుకున్నారు. పురుషులు ధరిస్తే అంతా అపశకునం జరుగుతుందనే భావనతో దాన్ని బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ లో కేవలం రాణులే ధరిస్తున్నారు.
1901 వరకు దీన్ని క్వీన్ విక్టోరియా ధరించారు. అనంతరం బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ 7వ భార్య క్వీన్ అలెగ్జాండ్రా దీన్ని కిరీటంలో ధరించారు. 1911 లో ఇది క్వీన్ మేరీకి, 1937లో క్వీన్ ఎలిజబెత్ కు ఈ వజ్రం బదిలీ అయింది. ప్రస్తుతం కోహినూర్ డైమండ్ ను టవర్ ఆఫ్ లండన్ లోని జ్యూవెల్ హౌజ్ లో ఎగ్జిబిషన్ కోసం పెట్టారు. లాహోర్ ఒప్పందం లో భాగంగా లీగల్ గానే ఈ డైమండ్ ను బ్రిటన్ కు తరలించామని బ్రిటీష్ ప్రభుత్వం చెబుతోంది. ఇండియాకు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
పురుషులకు కలిసి రాని డైమండ్..
1306 సంవత్సరం నుంచి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని వ్రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారి తరువాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజిబిత్ 2కు ఎటువంటి హానీ జరగలేదు. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కోసాగింది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది.