Rs.2,000 Notes: ప్రస్తుతం రూ.2000 నోట్ల(Rs.2,000 Notes)ను కొన్ని ఆర్బీఐ కేంద్రాల వద్ద వాపస్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ(April 1st)న ఆ సర్వీసు ఉండదని ఆర్బీఐ(RBI) వెల్లడించింది. వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ రోజు(Annual accounts closing day) కావడం వల్ల ఆ రోజు రూ.2000 నోట్ల ఎక్స్ చేంజ్ కుదరదు అని ఆర్బీఐ తెలిపింది. మళ్లీ ఆ సర్వీస్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐకి చెందిన 19 కేంద్రాల వద్ద ప్రస్తుతం రెండువేల నోట్ల మార్పిడి జరుగుతున్నది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సుమారు 97.2 శాతం చెలామణిలో ఉన్న రెండు వేల నోట్లు వాపస్ వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. సర్క్యులేషన్ నుంచి రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయ్పూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద రెండు వేల నోట్ల ఎక్స్చేంజ్ నడుస్తున్నది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎల్లుండి (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
కాగా, ఆర్బీఐ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్తోపాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి.