Human Remains To Moon : 50 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత తొలిసారిగా అమెరికా చందమామ వైపుగా సోమవారం రోజు ‘పెరెగ్రైన్ ల్యాండర్’ను ప్రయోగించింది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ల్యాండర్ తనతో పాటు తీసుకెళ్తున్న వస్తువులు, మెటీరియల్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
‘పెరెగ్రైన్ ల్యాండర్’లో ఏమేం ఉన్నాయి ?
- ‘పెరెగ్రైన్ ల్యాండర్’ను ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు కంపెనీ డెవలప్ చేసింది.
- ఈ కంపెనీ తరఫున ప్రస్తుతం ‘పెరెగ్రైన్ ల్యాండర్’ మూన్ మిషన్ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన శరద్ భాస్కరన్ వ్యవహరిస్తున్నారు.
- పెరిగ్రీన్ ల్యాండర్ ప్రయోగం కోసం రూ.898 కోట్లతో ఆస్ట్రోబోటిక్ కంపెనీతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- ‘పెరెగ్రైన్ ల్యాండర్’ జనవరి 8న తన జర్నీని మొదలుపెట్టింది. ఇది ఫిబ్రవరి 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం ఉంది.
- ఇది చంద్రుడిపై సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే 52 సంవత్సరాల తర్వాత మరోసారి చంద్రునిపైకి అమెరికా అడుగుమోపినట్టు అవుతుంది.
- చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత పెరెగ్రైన్ ల్యాండర్ 192 గంటల పాటు పని చేస్తుంది.
- ‘పెరెగ్రైన్ ల్యాండర్’లో 20 పేలోడ్లు ఉన్నాయి. వీటిలో 5 నాసాకు చెందినవి, మిగిలిన 15 పేలోడ్లు వేర్వేరు ప్రైవేట్ కంపెనీలవి.
- అమెరికాకు చెందిన ఎలిసియం స్పేస్, సెలెస్టిస్ అనే కంపెనీలు చనిపోయినవారి చితాభస్మం, అస్థికలను చంద్రుడిపైకి పంపించే సేవలను అందిస్తుంటాయి.
- ఇవి ఒక వ్యక్తి చితాభస్మం, అస్థికలను చంద్రుడిపైకి పంపేందుకు రూ.8 లక్షల దాకా వసూలు చేస్తాయి.
- ‘పెరెగ్రైన్ ల్యాండర్’.. పలువురు ప్రముఖుల చితాభస్మం, అస్థికలతో పాటు వందలాది మంది డీఎన్ఏ శాంపిల్స్ను కూడా చంద్రుడిపైకి తీసుకెళ్తోంది.
- ‘పెరెగ్రైన్ ల్యాండర్’ ఇప్పుడు మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, డ్వైట్ ఐసెన్హోవర్, జాన్ ఎఫ్. కెన్నెడీల డీఎన్ఏ నమూనాలను కూడా చంద్రుడిపైకి తీసుకెళ్తోంది. మొత్తంగా 265 మంది DNA శాంపిల్స్ను చంద్రుడిపై ‘పెరెగ్రైన్ ల్యాండర్’ దింపనుంది.
- ప్రముఖ వ్యోమగామి ఫిలిప్ చాప్మన్ DNA నమూనాలను కూడా ఈ ల్యాండర్ తీసుకెళ్తోంది. ఈయన ఎవరంటే.. చాలా ఏళ్ల క్రితం చివరి విడత అపోలో మిషన్ కింద చంద్రునిపైకి పంపేందుకు చాప్మన్ను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో ఆ మిషన్ ప్రారంభించబడలేదు. చాప్మన్ 2021లో చనిపోయారు. దీంతో చంద్రుడిపైకి వెళ్లాలనే ఆయన కోరికను ఇలా(Human Remains To Moon) నెరవేరుస్తున్నారు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే..
ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రుడిపైకి అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా ఆస్ట్రోబోటిక్ నిలువనుంది. అయితే, అంతకంటే ముందుగానే మరో కంపెనీ ఈ ఘనత సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హ్యూస్టన్కు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ త్వరలోనే మరో ల్యాండర్ను ప్రయోగించనుంది. ఇది చంద్రుడిపైకి నేరుగా మరో షార్ట్ కట్ రూట్లో వెళ్లనుంది. ఇవాళ ప్రయోగించిన పెరిగ్రీన్ ల్యాండర్ మాత్రం కక్ష్యలన్నీ తిరుగుతూ చంద్రుడికి చేరుతుంది. ఇక ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ తయారు చేసిన నోవా-సి ల్యాండర్ను ఫిబ్రవరి ఆరంభంలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. కేవలం వారంలోనే చంద్రుడిపైకి అడుగుపెట్టేలా ఈ ప్రయోగం జరగనుండటం విశేషం.