Brain Chip : తొలిసారిగా ఓ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చారు. 8 మిల్లీమీటర్ల వ్యాసంతో సమానమైన సైజు కలిగిన చిప్ను సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమర్చారు. ఈ ఘనతను న్యూరాలింక్ (Neuralink) కంపెనీ సాధించింది. ఈ సంస్థ ఎవరిదో తెలుసా ? ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్కే ఈ కంపెనీ ఓనర్. ఎలక్ట్రానిక్ చిప్ను మెదడులో అమర్చుకున్న వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ఈ చిప్ను మెదడులో అమర్చిన తర్వాత.. ఆ వ్యక్తిలో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్’ను గుర్తించినట్లు చెప్పారు. నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ఈ చిప్ లక్ష్యం. మనిషి మెదడు సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ చిప్తో ప్రయోగాలు చేస్తున్నారు. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉంది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ను(Brain Chip) అమర్చింది. అయితే, న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ అప్పట్లో వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్ఫేస్’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలోనే ఆమోదం తెలిపింది. అంటే ఈ చిప్ను మనుషుల మెదడులో అమర్చేందుకు న్యూరాలింక్ కంపెనీ అధికారిక అనుమతులు కూడా ఇప్పటికే పొందింది. ఈ చిప్ను ఇంతకుముందు ప్రయోగ పరీక్షల్లో భాగంగా పందులు, కోతుల మెదడులో అమర్చారు. దీంతో అది అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని తేలింది. ఈ చిప్ను అమర్చిన తర్వాత ఒక కోతి ‘పాంగ్’ వీడియో గేమ్ కూడా ఆడేంత తెలివితేటలను సొంతం చేసుకుంది. కాగా, న్యూరో టెక్నాలజీ కంపెనీ ‘న్యూరాలింక్’ను ఎలాన్ మస్క్ 2016లో స్థాపించారు. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘న్యూరాలింక్’ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రయోగాల కోసం న్యూరాలింక్ కంపెనీ ఇప్పటికే రూ.3వేల కోట్ల దాకా సేకరించింది.