Onions Export: ఉల్లి ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు స‌డ‌లింపు.. ఈ దేశాల‌కు ప్ర‌యోజ‌నం..!

భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై (Onions Export) ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 11:15 AM IST

Onions Export: భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై (Onions Export) ఆంక్షలను సడలించడం ప్రారంభించింది. దేశీయ మార్కెట్‌లో సరఫరా మెరుగుపడి ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీంతో కొన్ని పొరుగు దేశాలకు ఖరీదైన ఉల్లిపాయల నుంచి ఉపశమనం లభించనుంది. తాజా నిర్ణయంలో బహ్రెయిన్, మారిషస్ సహా పొరుగు దేశాలైన భూటాన్‌కు ఉల్లిపాయలను పంపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నోటిఫికేషన్ జారీ చేసింది

ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) బుధవారం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇప్పుడు భూటాన్, బహ్రెయిన్, మారిషస్‌లకు భారత్ నుండి ఉల్లి సరఫరా ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ ఉల్లి ఎగుమతి నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా జరుగుతుంది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. భూటాన్‌కు 3000 మెట్రిక్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. అదేవిధంగా బహ్రెయిన్‌కు 1200 మెట్రిక్‌ టన్నులు, మారిషస్‌కు 550 మెట్రిక్‌ టన్నుల ఉల్లి సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపింది.

Also Read: Income Tax: ఆదాయపు పన్ను రీఫండ్ ఇంకా అందలేదా? అయితే ఈ తేదీ నాటికి అకౌంట్లోకి డ‌బ్బు రావొచ్చు..!

అందుకే ఆంక్షలు విధించారు

గత ఏడాది ఉల్లి ఎగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ మార్కెట్‌లో తక్కువ లభ్యత, ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఉల్లి ఎగుమతిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై ఈ నిషేధం డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు విధించబడింది. ఇది దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించడంలో దోహదపడింది. అప్పుడే ప్రభుత్వం ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.

We’re now on WhatsApp : Click to Join

గతేడాది ఆగస్టులో ఉల్లి ఎగుమతిని ప్రభుత్వం తొలిసారిగా నిషేధించింది. ఆ సమయంలో ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. దాని వల్ల ప్రయోజనం లేకపోగా ప్రభుత్వం కనీస ఎగుమతి రేటును టన్నుకు $800గా నిర్ణయించింది. అయితే ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోలేదు. స్నేహపూర్వక దేశాలకు మాత్రమే పరిమిత పరిమాణంలో ఉల్లిని సరఫరా చేసేందుకు ఆమోదం లభిస్తోంది.