Site icon HashtagU Telugu

Swami Vivekananda : నేడు స్వామి వివేకానంద వర్ధంతి.. ఆయన జీవితంలోని ఆసక్తికర అంశాలివీ

Swami Vivekananda

Swami Vivekananda : ఇవాళ(జులై 4) స్వామి వివేకానంద వర్ధంతి.  1863 సంవత్సరం జనవరి 12న కోల్‌కతాలో జన్మించిన స్వామి వివేకానంద.. 1902 సంవత్సరం జులై 4న హౌరాలోని బెలూర్ మఠంలో తుదిశ్వాస విడిచారు.  39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన స్వర్గస్తులయ్యారు. ఈ తక్కువ టైంలోనే స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ మహా మనిషి వర్ధంతి సందర్బంగా ఆయన జీవితంతో ముడిపడిన కొన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం..

 We’re now on WhatsApp. Click to Join
  • స్వామి వివేకానందుడికి రసగుల్లా, జామపండు, కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం.
  • గాంధీజీలాగే స్వామి వివేకానందుడు కూడా రోజూ మేక పాలు తాగేవారు.
  • వేదాలు, వేదాంతాలపై పుస్తకం కొనకముందే.. ఫ్రెంచ్ కుకింగ్ ఎనసైక్లోపీడియా బుక్‌ను వివేకానంద కొన్నారు.
  • శాస్త్రీయ సంగీతంలో ఆయన శిక్షణ తీసుకున్నారు.
  • పఖావజ్, తబలా, ఇస్‌రాజ్, సితార్ లాంటి సంగీత వాయిద్య పరికరాలను ఎలా వాయించాలో వివేకానందుడికి తెలుసు.
  • జంతువులను పెంచడమంటే వివేకానందకు(Swami Vivekananda) చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క ‘బాఘా’ను ఆయన గంగా నదీ తీరంలోని ఒక ప్రార్థనా స్థలం ఆవరణలో పాతిపెట్టారు.
  • చెస్ ఆడటంలోనూ స్వామి వివేకానంద నైపుణ్యం సాధించారు.
  • స్వామి వివేకానందుడికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. ఆ పాటలే ఆయన్ను గురువు రామకృష్ణ పరమహంసకు చేరువ చేశాయి.
  • వివేకానందకు ఆయన తండ్రి పెళ్లి చేయాలని భావించేవారు. కానీ దాన్ని వివేకానందుడు వ్యతిరేకించారు.
  • ఇంట్లో పెద్దకొడుకు కావడంతో తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం స్వామి వివేకానందుడిపై పడింది. ఆ టైంలోనే మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్‌లో స్వామీజీ పాఠాలు చెప్పేవారు.
  • 1886లో రామకృష్ణ పరమహంస ఆరోగ్యం విషమించడం మొదలైంది. ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది. దీంతో వివేకానందను తన వారసుడిగా ప్రకటించారు.
  • 1886 ఆగస్టు 16న రామకృష్ణ పరమహంస మహాసమాధిలోకి వెళ్లిపోయారు.
  • ఆ తర్వాత రామకృష్ణ మిషన్‌ను వివేకానంద ఏర్పాటుచేశారు.
  • 1898లో కోల్‌కతాలో ప్లేగు మహమ్మారి విజృంభించిన టైంలో వివేకానంద కోల్‌కతాలోనే ఉన్నారు. ప్రజల కోసం ఆయన సహాయక చర్యలు మొదలుపెట్టారు.
  • ఒకసారి స్వామి వివేకానందుడు, బాల గంగాధర్ తిలక్ ఒకే కారులో ప్రయాణించారు. అప్పుడు తిలక్, వివేకానందల మధ్య లోతైన చర్చ జరిగింది. పుణెలో తన ఇంటికి రావాలని వివేకానందను తిలక్ ఆహ్వానించారు. దీంతో పది రోజులు అక్కడే వివేకానంద ఉన్నారు.
  • బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లి..  అక్కడ మహారాజా అతిథిగా కొన్ని రోజులు బస చేశారు. అమెరికాకు వెళ్లి భారత సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉందని మహారాజాతో స్వామీజీ చెప్పారు. దీంతో అమెరికా పర్యటకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ తానే భరిస్తానని మహారాజా చెప్పారు.
  • 1893 మే 31న మద్రాసు నుంచి స్టీమర్ ‘పెనిన్‌సులా’లో తన అమెరికా ప్రయాణాన్ని వివేకానంద మొదలుపెట్టారు. అప్పుడు భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన జంషెడ్ జీ టాటా కూడా వివేకానందతో ఉన్నారు. వీరిద్దరి మధ్య అలా స్నేహబంధం చిగురించింది.
  • షికాగోలో జరిగిన ధర్మ సంసద్‌లో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగమే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులను తీసుకొచ్చింది.
  • భారత్‌కు తిరిగివచ్చేటప్పుడు ఆయన కొన్నిరోజులు ఇంగ్లండ్‌లో ఉన్నారు. అప్పుడే ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది.
  • బిపిన్ చంద్రపాల్‌ను కూడా ఆయన ఇంగ్లండ్‌లోనే కలిశారు.
  • వివేకానంద భారత్‌కు వచ్చినప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు వీధుల్లో ప్రజలు వరుసగా నిలబడ్డారు. మొదట ఆయన మద్రాసులో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన కుంభకోణం వెళ్లారు. ప్రతిచోటా ఆయన్ను చూసేందుకు ప్రజలు వరుసకట్టారు.
  • మహాసమాధి జరిగిన రోజున(1902 సంవత్సరం జులై 4న)  వివేకానంద చాలా త్వరగా లేచారు. ఆ తర్వాత ప్రార్థనా స్థలంలోని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు, కిటికీలను ఆయన మూసివేశారు. మూడు గంటలపాటు ఆయన లోపల ధ్యానం చేశారు. ఆ తర్వాత శిష్యులతో కలిసి భోజనం చేశారు. నాలుగు గంటల సమయంలో ఆయన వేడి పాలు తాగారు. ఆ రోజు సాయంత్రం ప్రార్థనల గంట మోగినప్పుడు, వివేకానంద తన గదిలోకి వెళ్లి ధ్యానం చేస్తూ కనిపించారు.
  • సాయంత్రం 8 గంటలకు ఒక శిష్యుడిని పిలిచి తల దగ్గర ఫ్యాన్ పెట్టాలని సూచించారు. అప్పుడు ఆయన నిద్రపోతూ కనిపించారు.
  • గంట తర్వాత స్వామీజీ నుదుటిపై చెమటలు కనిపించాయి. ఆయన చేతులు కూడా వణికేవి. అప్పుడు ఆయన దీర్ఘ శ్వాస తీసుకున్నారు.
Exit mobile version