Nepal – Hindu State : ప్రపంచ దేశాలన్నీ రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపుగా కదులుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మతతత్వం నుంచి లౌకిక భావన వైపుగా అడుగులు వేస్తున్నాయి. కానీ నేపాల్లో సామాజిక పరిణామాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు చైనా జోక్యంతో నేపాల్లో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. నేపాల్లో మళ్లీ రాచరికాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మాజీ రాజు జ్ఞానేంద్రకు మద్దతుగా రాజధాని ఖాట్మండులో నిరసనలు హోరెత్తుతున్నాయి. వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చే రాచరిక విధానమే నేపాల్కు మంచిదని వాదిస్తున్నారు. గతంలో నేపాల్ హిందూదేశంగా ఉండేదని, మళ్లీ దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
‘‘మాకు ప్రాణం కంటే రాజు ముఖ్యం. రాచరికం మళ్లీ కావాలి. గణతంత్రం వద్దు’’ అని నిరసనకారులు తేల్చి చెబుతున్నారు. నేపాల్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపిస్తున్నారు. అందుకే ఈ విఫలమైన పాలనా వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిరసనల వెనుక చైనా హస్తం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపాల్ సర్కారు భారత్తో కలిసి పనిచేస్తోంది. అది నచ్చకపోవడం వల్లే నేపాల్ రాజ కుటుంబం నుంచి కొంతమందిని ప్రస్తుత ప్రభుత్వంపైకి ఎగదోసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు ఎందుకు దారితీస్తాయి ? చివరికి ఏం జరుగుతుంది ? అనేది వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
దుర్గాకుమార్ ప్రసాయ్ అనే ఓ బడా పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో నేపాల్ ఈ డిమాండ్లతో పౌర ఉద్యమం జరుగుతోంది. దుర్గాకుమార్ ప్రసాయ్ గతంలో సీపీఎన్ (యూఎంఎల్) సెంట్రల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించేవారు. ఈ బడాపారిశ్రామివేత్త తనకున్న రాజకీయపరపతితో గతంలో భారీగా ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడని, వాటిని ఎగవేయడానికే ఈ ఉద్యమం ఆరంభించాడని గిట్టనివారు ఆరోపిస్తున్నారు.
2006లో రాజు జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ షా దేవ్ అధికారంలో ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా అనేక వారాల పాటు పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. అప్పటి రాజు జ్ఞానేంద్ర తన పాలనను వదులుకుని ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాల్సి వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత (2008లో) కొత్తగా ఎన్నికైన పార్లమెంటు.. రాచరికాన్ని రద్దు చేసింది. దీంతో నేపాల్ కూడా భారత్ తరహాలో గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రిపబ్లిక్ అర్థం ఏమిటంటే.. దేశానికి అధిపతి అధ్యక్షుడు, రాజు కాదు. ఆ తర్వాత నేపాల్ను సెక్యులర్ దేశంగా(Nepal – Hindu State) ప్రకటించారు.