Electoral Bonds : సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దిగొచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ సమర్పించింది. ఈవిషయాన్ని ఎస్బీఐ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్చి 15న సాయంత్రం 5 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని ప్రజల కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివరాలను వెల్లడించడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇంకా టైం ఇచ్చేది లేదని.. మంగళవారం సాయంత్రంకల్లా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాల్సిందే అని ఎస్బీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎస్బీఐ తీరుపై దేశ సర్వోన్నత న్యాయ స్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుపట్టింది. బ్యాంకు వేసిన పిటిషన్ను కొట్టేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రం ఈసీకి స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) సమర్పించింది.
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్బీఐ దేశంలోని వివిధ బ్రాంచీల ద్వారా విక్రయించింది. ప్రత్యేకించి ముంబై, హైదరాబాద్, ఢిల్లీలలోని బ్రాంచీలలోనే 70 శాతం బాండ్ల విక్రయాలు జరిగాయి. ఈ బాండ్ల విక్రయాల ద్వారా మొత్తం రూ.16,518 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే వాటిని ఇచ్చింది ఎవరు ? అనేది ఇప్పటిదాకా తెలియదు. దాతల విరాళాలను దాచడం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను సేకరించే పద్ధతిని రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), సీపీఎం దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈనేపథ్యంలో ఎలక్టోరల్బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి రిఫరెన్స్ కోరాలని ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించడం వల్ల వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది.