Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆయన ఏప్రిల్ 15 వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు. జైలులో ఉన్నా ఢిల్లీ సీఎం కేజ్రీవాలే అని ఆప్ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వాళ్లు చెబుతున్న విధంగా జైలు నుంచి సీఎం స్థాయి వ్యక్తి కార్యకలాపాలు నిర్వహించగలరా ? లేదా ? అందుకు చట్టాలు అనుమతిస్తాయా ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం సీఎం పదవిలోనే ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. ఈడీ కస్టడీలో ఉండగా రెండుసార్లు పాలనాపరమైన ఆదేశాలను జారీ చేశారు. ఇప్పుుడు ఆయనను తీహార్ జైలుకు(Rule From Jail) ప్రస్తుతం కారాగారానికి తరలించిన నేపథ్యంలో.. సీఎంగా కొనసాగడం, పాలనాపర వ్యవహారాలు నిర్వహించడం కుదరదనే అభిప్రాయం న్యాయ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. జైలు నుంచి సీఎంగా రాష్ట్రాన్ని పాలించేందుకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే జైలులో ఉంటూ ప్రభుత్వాన్ని గైడ్ చేయడం జరిగే విషయం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని నిషేధించే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని.. అది అరవింద్ కేజ్రీవాల్కు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. అయితే కేజ్రీవాల్ నామమాత్రపు సీఎంగా జైలు గోడలకు పరిమితం అవుతారని.. ఆయన తరఫున ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక నేతలు నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. సీఎం హోదాలో ఉండగా జైలుపాలైన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇలా ఒక ముఖ్యమంత్రి జైలు పాలవుతారని మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. అందుకే దానితో ముడిపడిన నిబంధనలను చేర్చలేదు. అప్పట్లో మన రాజ్యాంగ నిర్మాతలు అధ్యయనం చేసిన విదేశీ రాజ్యాంగాల్లో కూడా ఈ తరహా నిబంధనలేవీ లేవు.
ప్రభుత్వ పథకాలపై సమీక్షలు, మంత్రులతో శాఖల స్థాయి రివ్యూలు, బడ్జెట్పై మేధోమధనం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రతీసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు అనుమతులు లభించకపోవచ్చు. సీఎం లేకుండా ఈ తరహా సమావేశాలు నిర్వహించినా.. మంత్రి వర్గంలోని ఎవరో ఒక సీనియర్ నేత సారథ్యం వహించి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి ప్రత్యామ్నాయ పాలనాపరమైన సెటప్ను ముందే కేజ్రీవాల్ రెడీ చేశారా ? లేదా ? అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి సమావేశాల్లో ఆప్ నుంచి ఆమె ప్రధాన ప్రసంగం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సీటులో కూర్చొని ప్రజలను ఉద్దేశించి సునీత మాట్లాడుతున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నా.. సునీత కేజ్రీవాల్ కనుసన్నల్లో ఢిల్లీలోని ఆప్ సర్కారు నడిచే అవకాశం ఉంది. గతంలోకి వెళితే.. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తాను అరెస్టయినప్పుడు.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపొచ్చనే అభిప్రాయంతో ఉండేవారు. ఆ తర్వాత అది సాధ్యపడదని గుర్తించి.. తన సతీమణి రబ్రీ దేవీని ఆమె సీఎం చేశారు.
తీహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రెండో నంబరు గదిని కేటాయించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఇదే జైలులో ఒకటో నంబరు గదిలో ఉన్నారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు ఐదో నంబరు గదిని కేటాయించారు. మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఏడో నంబరు సెల్లో ఉన్నారు.