Japan Moon Lander : ఎట్టకేలకు చంద్రుడి గడ్డపై నుంచి జపాన్కు గుడ్ న్యూస్ చేరింది. జనవరి 20వ తేదీన చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన జపాన్ ల్యాండర్ ‘స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్)’ పనిచేయడం మొదలుపెట్టింది. జపాన్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటరుతో కమ్యూనికేట్ కావడం మొదలు పెట్టింది. దీంతో అమెరికా, సోవియట్, చైనా, భారత్ తర్వాత ఈ ఘనతను సాధించిన ఐదో దేశంగా జపాన్ నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
జపాన్ ల్యాండర్ ‘స్లిమ్’(Japan Moon Lander) తాజాగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇది చంద్రుడిపై దిగిన సమయంలో తలకిందులుగా పడిపోయింది. దీంతో దానిపై అమర్చి ఉన్న సోలార్ ప్లేట్లకు సూర్య కాంతి తాకలేదు. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యుదుత్పత్తి చేయలేకపోయింది. అప్పటివరకు బ్యాటరీ పవర్తో ల్యాండర్ మందకొడిగా పనిచేసింది. కానీ, గత శనివారం నుంచి చంద్రుడిపై కాంతి గమనం మారడంతో తాజాగా సోలార్ ప్యానల్స్పై ఎండ పడింది. దీంతో వాటిలో కరెంటు ఉత్పత్తి మొదలైంది. ఫలితంగా ల్యాండర్ పనిచేయడం మొదలుపెట్టింది. ల్యాండర్లోని సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదివారం రాత్రి ల్యాండర్తో సంబంధాలను పునరుద్ధరించామని జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
జపాన్ ల్యాండర్ స్లిమ్ .. చంద్రుడిపై ఉన్న ఒక రాయిని ఫొటో తీసి జపాన్ అంతరిక్ష సంస్థకు పంపించింది. దానికి ‘టాయ్ పూడ్లే’ అని పేరు పెట్టారు. చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోని రాళ్ల గుట్టపై ఈ ల్యాండర్ పరిశోధన చేయనుంది. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే సుదీర్ఘ రాత్రులను తట్టుకొని పనిచేసేలా ఈ ల్యాండర్ను తయారు చేశామని జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జాక్సా) తెలిపింది. ఈనెల మొదట్లో అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ కూడా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం లూనార్ మిషన్ నిర్వహించింది. అయితే దానికి సంబంధించిన రాకెట్ ఫెయిలై పసిఫిక్ సముద్రంలో కూలిపోయింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టెమిస్ -3 మిషన్ను 2026లో ప్రయోగిస్తామని ప్రకటించింది. 1972లో అపోలో 17 తర్వాత ఈ మిషన్ ద్వారానే మనుషులను జాబిల్లిపైకి పంపేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ప్లానెటరీ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్గా మారింది. చంద్రుడు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాడని, దక్షిణ ధ్రువంపై ప్రకంపనాల వల్ల ఉపరితలం పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చారు. ఆర్టెమిస్ను నాసా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించాలని ప్రణాళిక రచించిందని, అయితే చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, ఇక్కడ చాలా భాగం సేఫ్ల్యాండింగ్కు అనుకూలంగా లేదని అధ్యయనంలో తేలింది. చంద్రుడిపై జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో వ్యోమగాములకు సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరించింది.