Offer to Prisoners : ఇక ఖైదీలను కూడా ఆర్మీలోకి తీసుకోనున్నారు. అయితే ఒక షరతు. వారు రష్యాతో జరిగే యుద్దంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈమేరకు తమ దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉక్రెయిన్ పెద్ద ఆఫర్ ఇస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
రష్యాతో గత రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్రమైన సైనికుల కొరత ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకే ఖైదీలను కూడా సైన్యంలోకి తీసుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ సిద్ధమైంది. ఆర్మీలో చేరే ఖైదీలపై ఉన్న కేసులన్నీ కొట్టివేసేందుకు రెడీ అయింది. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలకు శాలరీలు కూడా భారీ స్థాయిలోనే ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఈ జైలు జీవితానికి మీరంతా ఇక ముగింపు పలకండి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. ఇందుకోసం మీరు చేయాల్సింది ఒకటే పని.. మీ మాతృభూమిని కాపాడుకునేందుకు ముందంజలో ఉండి పోరాటం చేయాలి’’ అని ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఖైదీలకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఖైదీలకు(Offer to Prisoners) ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది.
దేశ ప్రయోజనాల రీత్యా ఖైదీలను ఆర్మీలోకి తీసుకునే నిబంధనలతో కూడిన చట్టాన్ని గత నెలలోనే ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటికే 3వేల మంది ఖైదీలను ఉక్రెయిన్ ఆర్మీలోకి తీసుకున్నారు. త్వరలో మరో 27 వేల మంది ఖైదీలను చేర్చుకోవాలనే ప్లాన్తో ఉక్రెయిన్ ఆర్మీ ఉంది. ఆర్మీలోకి తీసుకునే ముందు ఖైదీలకు పడిన శిక్ష వివరాలను, ఆరోగ్య స్థితిగతుల సమాచారాన్ని సమీక్షిస్తున్నారు. అత్యాచారం, హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను మాత్రం ఉక్రెయిన్ ఆర్మీలోకి తీసుకోవడం లేదు. ఇంటర్వ్యూలో ఎంపికయ్యే వారికి సాధారణ ట్రైనింగ్ ఇచ్చి రష్యా బార్డర్కు పంపుతున్నారు. మరోవైపు రష్యా కూడా ఖైదీలను ఆర్మీలోకి తీసుకుంటోంది. అయితే వారిని నేరుగా దేశ సైన్యంలోకి తీసుకోకుండా.. ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్లో రిక్రూట్ చేసుకుంటోంది.