Yogini Ekadashi 2024 : ఇవాళ యోగిని ఏకాదశి. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తుంటాయి. వాటిలో ప్రతీ ఏకాదశికి ఒక్కో రకమైన విశిష్టత ఉంది. అలాగే ఈరోజు మనం జరుపుకునే యోగిని ఏకాదశికి కూడా ప్రత్యేకత ఉంది. ఈసందర్భంగా వ్రతం పాటించే వారికి ఎన్నో పుణ్యఫలాలు వస్తాయి. మనిషి శరీరం, మనస్సులపై అదుపు సాధించి భగవంతుడి సన్నిధికి చేరుకోవాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతుంటారు. యోగిని ఏకాదశి సందర్బంగా ఇవాళ ఉపవాసం, ధ్యానం, విష్ణుసహస్రనామ పారాయణం చేయాలని సూచిస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join
కుబేరుడు సంపదకు అధిపతి. ఈయన యక్షుల రాజు. నివాసం ఉండేది అలకాపురిలో. విశ్వంలోని సంపదను కాపాడే బాధ్యతను కుబేరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. కుబేరుడు తన సేవకులైన యక్షులను ఆ సంపదకు కాపలాగా ఉంచుతాడు.కుబేరుడు నిత్యం శివుడిని పూజిస్తుంటాడు. తన పూజకు పూలను సమకూర్చే బాధ్యతను హేమాలి అనే యక్షుడికి అప్పగించాడు. హేమాలికి స్వరూపవతి అనే యక్షిణితో పెళ్లి జరిగింది. అనంతరం ఓ రోజు కుబేరుడి పూజ కోసం పూలు ఇవ్వడాన్ని హేమాలి మర్చిపోయాడు. పూజకు పూల కోసం ఎదురుచూసి ఆగ్రహించిన కుబేరుడు.. హేమాలిని శపించాడు. శరీరంపై మోహంతో దైవపూజను మర్చిపోయావు.. నీ భార్యకు దూరంగా కుష్టువ్యాధితో భూలోకంలో జీవించు అని హేమాలిని కుబేరుడు శపించాడు.
అనంతరం మార్కండేయ రుషి ఆశ్రమానికి హేమాలి చేరుకున్నాడు. తనకు శాపవిమోచనం ఏమిటని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఉపదేశించిన యోగిని ఏకాదశి వ్రతం గురించి మార్కండేయుడు హేమాలికి వివరిస్తాడు. ఆయన సూచించిన విధంగా యోగిని ఏకాదశి (Yogini Ekadashi 2024) రోజు వ్రతం చేసి హేమాలి శాపవిమోచనం పొందాడు.అందుకే శరీరం, మనసు అదుపులో ఉండాలంటే ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం ఉండాలని పండితులు చెబుతుంటారు. ఏ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలన్నా దశమి రోజు రాత్రి నుంచే నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు కూడా శ్రీ మహావిష్ణువును పూజించి, దాన ధర్మాలు చేసి భోజనం చేయాలి.