Human Milk : తల్లిపాల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ప్రకటన చేసింది. మన దేశంలో తల్లిపాల విక్రయాలకు ఎటువంటి అనుమతులు లేవని వెల్లడించింది. తల్లిపాల ఉత్పత్తులను విక్రయించేందుకు తమ నియమాలు అనుమతించవని స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ -2006 చట్టంలోని నిబంధనల ప్రకారం.. తల్లిపాల ప్రాసెసింగ్, విక్రయాలకు అనుమతులు లేవని తేల్చి చెప్పింది. వాటి కమర్షియల్ వినియోగాన్ని, విక్రయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఒకవేళ వాటి విక్రయాలు,పంపిణీ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
దాతల నుంచి సేకరించే తల్లిపాలను(Human Milk) వాణిజ్య అవసరాల కోసం వాడరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. చనుబాల నిర్వహణ కేంద్రాలతో కూడిన ఆరోగ్య సౌకర్యాల్లో చేరిన శిశువులకు మాత్రమే ఆ పాలు అందాలని తెలిపింది. తల్లిపాలను దాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ఉచితంగా, స్వచ్ఛందంగా ఇవ్వాలని పేర్కొంది. ఇలా సేకరించిన పాలను ఆస్పత్రిలో ఉండే పసికందులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేసింది.
అప్పుడే పుట్టిన శిశువులకు పాలు తప్పక ఇవ్వాలి. డబ్బా పాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. చాలా మంది తల్లులు అనేక కారణాల వల్ల బిడ్డకు చనుబాలు కాకుండా డబ్బా పాలు ఇస్తున్నారు. దీనివల్ల బిడ్డకు సరైన పోషణ అందదు. శిశువుకు తల్లి తన స్తన్యం పంచడం ద్వారా ఆ శిశువుకు మాత్రమే కాకుండా, తల్లికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల తల్లికి భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం. తల్లిపాలు బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు. శిశువు అనారోగ్యాల బారినపడకుండా వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలు తల్లి పాలలో ఉంటాయి.