1301 Deaths : ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1,301 మంది హజ్ యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. వీరిలో చాలామంది విపరీతమైన వేడిలో ఎక్కువ దూరం నడవడం వల్లే చనిపోయారని తెలిపింది. చనిపోయిన వారిలో మూడువంతుల మంది అనధికారికంగా హజ్ యాత్రకు వచ్చిన వారేనని చెప్పింది. ఈసారి అనుమతులు లేకుండా హజ్ యాత్రకు వచ్చిన వారి సంఖ్య 1.40 లక్షలు ఉంటుందని సౌదీ సర్కారు పేర్కొంది. ఈ ఏడాది హజ్ యాత్ర 50 డిగ్రీల ఎండల్లో జరిగిందని.. దాన్ని పట్టించుకోకుండా కాలినడకన ప్రయాణం చేసిన వారిలో పలువురు చనిపోవడం విషాదకరమని వెల్లడించింది. మధ్యలో విశ్రాంతి తీసుకొని.. ఎండ నుంచి రక్షణ పొందే మార్గాలను అవలంభించి ఉంటే వారికి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పింది. చనిపోయిన 1,301 మంది హజ్ యాత్రికుల్లో(1301 Deaths) 658 మంది ఈజిప్షియన్లు, 200 మంది ఇండోనేషియన్లు, దాదాపు 100 మందికిపైగా భారతీయులు ఉన్నారు. పాకిస్తాన్, మలేసియా, జోర్డాన్, ఇరాన్, సెనెగల్, సూడాన్, ఇరాక్ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతాల వారు కూడా చనిపోయిన యాత్రికుల జాబితాలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మక్కాకు అక్రమంగా యాత్రికులను పంపిన 16 పర్యాటక కంపెనీల లైసెన్సులను ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా మద్బౌలీ శనివారం రద్దుచేశారు. వాటి నిర్వాహకులపై విచారణకు ఆదేశించారు. మక్కాకు అనధికారికంగా ముస్లిం యాత్రికులను పంపిన అనేకమంది ట్రావెల్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్టు జోర్డాన్ ప్రభుత్వం తెలిపింది. ట్యూనిషియా అధ్యక్షుడు కైస్ సయీద్ తమ దేశ మత వ్యవహారాల శాఖ మంత్రిని తొలగించారు. హజ్ అనుమతులను ఆయా దేశాలకు కోటా పద్ధతిలో కేటాయిస్తారు. ఆ కోటా ప్రకారం లాటరీ తీసి హజ్ యాత్రకు వెళ్లేందుకు యాత్రికులకు అవకాశం కల్పిస్తారు.
అయితే తక్కువ ఖర్చుతో హజ్ యాత్రకు వెళ్లాలని భావించిన వారి జీవితాలతో ఆయా దేశాల ట్రావెల్ ఏజెంట్లు చెలగాటం ఆడారు. అనధికారికంగా హజ్ యాత్రకు వెళితే అరెస్ట్ అయ్యే ముప్పు ఉంటుందని తెలిసినా చాలామంది అందుకు సిద్దపడ్డారు. ఈసారి అనుమతులు లేకుండా హజ్ యాత్రకు వచ్చిన వారి సంఖ్య 1.40 లక్షలు. వీరిలో చాలామందిని దారి మధ్యలోనే గుర్తించి వెనక్కి పంపేశారు. కొంతమంది తనిఖీల నుంచి తప్పించుకొని మక్కాకు చేరుకునే క్రమంలో వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.