Space Debris Hit Home : అంతరిక్షంలోనూ ఎంతో చెత్త ఉంది. అది భూమిపై పడి.. ఎవరికైనా, ఏదైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరిది ? అనే అంశంపై ఇప్పుడు అంతటా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 8న జరిగిన ఓ ఘటనతో ఈ చర్చ మొదలైంది. ఆ రోజున అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నేపుల్స్లో ఉన్న ఓ ఇంటిపై అంతరిక్ష శిథిలం ఒకటి వచ్చి పడింది. దీంతో ఆ ఇంటి పైకప్పుకు రంధ్రం పడింది.
We’re now on WhatsApp. Click to Join
దీంతో నేపుల్స్లోని ఆ ఇంట్లో నివసించే అలెజాండ్రో ఒటెరో ఆగ్రహానికి గురయ్యారు. తన ఇంటిపై పడింది అంతరిక్ష శిథిలమని ఆయన గుర్తించారు. దానివల్ల తన ఇంటికి నష్టం జరిగినందుకు.. ఆ టైంలో ఇంట్లోనే ఉన్న తన కుమారుడికి కొంచెంలో ప్రాణాపాయం తప్పినందుకు నాసా నుంచి నష్ట పరిహారం ఇప్పించాలంటూ కోర్టును అలెజాండ్రో ఒటెరో ఆశ్రయించారు. తమ ఇంటి పైకప్పు దెబ్బతిందని.. నష్టపరిహారంగా రూ.66 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ అంతరిక్ష శిథిలం ఇంటిపై పడగానే తాము భయాందోళనలకు గురయ్యామని చెప్పారు. తమ ఇంటిపై పడిన అంతరిక్ష శిథిలం దాదాపు 700 గ్రాముల బరువు ఉందని తన పిటిషన్లో అలెజాండ్రో ఒటెరో ప్రస్తావించారు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా అందులో జతపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో నాసా(Space Debris Hit Home) ఎలా స్పందిస్తుంది ? బాధిత కుటుంబానికి ఎంత పరిహారం చెల్లిస్తుంది ? అనే అంశాలు భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాల ముప్పుకు సంబంధించిన న్యాయ పోరాటానికి కొత్త బాటలు వేయనున్నాయి.
కీలకమైన విషయం ఏమిటంటే.. పిటిషనర్ అలెజాండ్రో ఒటెరో వాదనతో నాసా ఏకీభవించింది. పనికి రాకుండా పోయిన బ్యాటరీల కార్గో ప్యాలెట్ను 2021 సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వదిలేశారని తెలిపింది. అందులోని ఒక భాగమే ఫ్లోరిడా రాష్ట్రం నేపుల్స్లో ఉన్న ఆ ఇంటిపై పడిందని వెల్లడించింది. ఈ కేసులో కోర్టుకు నాసా ప్రతిస్పందన తెలియజేయడానికి మరో ఆరు నెలల టైం ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై నాసా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.