ఆర్థిక సంక్షోంభం కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్ (Lay off) బాటన పడుతుండటం.. ఆ ప్రభావం ఇతర కంపెనీలపై చూపుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గూగుల్, ట్విట్టర్, అమెజాన్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అయితే ఎన్నో ఆశలతో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులపై (BTech Students) కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్థిక సంక్షోభమో, ఇతర కారాణాలో తెలియదు కానీ ఇకపై క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ ఉండకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
40శాతం కంపెనీలు దూరం
ఉన్న ఉద్యోగాలనే ఊడబీకేస్తున్న వేళ, కొత్త ఉద్యోగాల విషయంలో కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. క్యాంపస్ (Campus) తలుపు తట్టడం మానేశాయి. మాంద్యం దెబ్బకి పేరుగొప్ప కంపెనీలన్నీ లే ఆఫ్ లతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఐటీరంగం గతంలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 ప్రముఖ కంపెనీలు లే ఆఫ్ లు ప్రకటించగా ప్రపంచ వ్యాప్తంగా 1.10 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ గణాంకాలు ఉద్యోగస్తుల్నే కాదు, ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ (BTech Students) ని కూడా భయపెడుతున్నాయి. తాజాగా ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. కరోనా తర్వాత క్యాంపస్ రిక్రూట్ మెంట్ లు భారీగా పెరిగినా, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు 40శాతం కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఆపేశాయి.
డైలమాలో విద్యార్థులు
గతేడాదితో పోల్చితే సాధారణ నియామకాలు 40శాతం వరకు తగ్గిపోగా.. పెద్ద ప్యాకేజీ వేతనాలు 60శాతం వరకు తగ్గాయని తెలుస్తోంది. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు విద్యార్థులకు (BTech Students) పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ప్రకటించడంలేదు. టీసీఎస్ ఇంటర్వ్యూల తర్వాత కూడా మరికొన్ని టెస్ట్ లు పెడతామంటోంది. విప్రో సంస్థ ఎప్పుడూ నిర్వహించే నేషనల్ టాలెంట్ హంట్ ని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇన్ఫోసిస్ ఫూల్ డ్రైవ్ నిర్వహించలేదు. చేపట్టిన నియామకాలనే తగ్గించింది. టెక్ మహీంద్ర, క్యాప్ జెమిని, మైండ్ ట్రీ లాంటి సంస్థలు గతంతో పోల్చితే నియామకాలు బాగా తగ్గించాయి. కాగ్నిజెంట్ సంస్థ గతేడాది చేసుకున్న నియామకాల్లో కొన్నింటిని పక్కన పెట్టింది. దీంతో అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్థులు కూడా డైలమాలో పడ్డారు. క్యాంపస్ కొలువులు రాకపోయినా దిగులు లేదని, బీటెక్ తర్వాత నైపుణ్యాలు (Skills) పెంచుకోవడంపై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు.
Also Read: Vinaro Bhagyamu Vishnu Katha: క్లీన్ U/A సర్టిఫికెట్ అందుకున్న “వినరో భాగ్యము విష్ణు కథ”