CM Revanth Reddy : ఇండియా పాకిస్తాన్ బార్డర్‌లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 12:21 PM IST

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే ధీటుగా బీఆర్‌ఎస్‌ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం పూనుకుందని, అందుకోసం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారన్నారు. వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచిందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారని, ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా? అని ఆయన దుయ్యబట్టారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారని సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని, కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని.. ఈ నేపథ్యంలో దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చిందని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని శాసన సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్‌ అన్నారు. కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండన్నారు. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండని, తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండంటూ సీఎం రేవంత్‌ వ్యంగ్యస్ర్తాలు సంధించారు. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.

తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..? అని ఆయన అన్నారు. కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారని, కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా అంటూ రేవంత్‌ చురకలు అంటించారు. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే… హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉందని, రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారని, కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

Read Also : Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం