MLC Kavitha: రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి మరింత మంది మహిళలు

సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 11:21 AM IST

లండన్ : సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు. దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గానూ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్ లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ నెలకు రూ. వెయ్యి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని అన్నారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సహంతో సాంఘీక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిందని ప్రస్తావించారు.

మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామని, తద్వారా మైనారిటీల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా పాఠశాలలకు వెళ్తున్నాయని చెప్పారు. మోడల్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రిసెర్చ స్కాలర్లకు స్టైఫండ్ ను మూడు సార్లు పెంచామని, కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక జీతాలు ఇస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కు 30 శాతం రిస్క్ అలవెన్సు అందిస్తున్నామని, రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 20 వేల వేతనం లభిస్తోందని వివరించారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పడంలో సందేహమే లేదని, తెలంగాణ ఏర్పాటు కావడమే తన లక్ష్యమని పదువులుముఖ్యం కాదని కేసీఆర్ అన్నారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి యూపీఏ కూటమి నుంచి బయటికి వచ్చారని తెలిపారు. ఆ సందర్భంలోనే తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు తాను మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక గ్రామీణ మహిళా తనకు ఒక వెయ్యి రూపాయల ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అయితే, నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించానని తెలిపారు. ఆ సంస్థ ద్వారా మహిళా సాధికాతరకు కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా తెలంగాణ సంస్కృత, సంప్రదాయాలను ప్రోత్సహించామని, ముఖ్యంగా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తుతం 65-70 దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేశానని చెప్పారు. ప్రజా జీవితంలో మనం ఏమిటో అన్నది మాత్రమే ప్రజలు చూస్తారని, కుటుంబ నేపథ్యాన్ని కాదని స్పష్టం చేశారు.

తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరుచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న విషయాన్ని తానే అనేక సందర్భాల్లో గర్తించానని చెప్పారు. భూప్రపంచంలో కేవలం మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో రాజకీయ పార్టీల్లోనూ మహిళల తక్కువ ప్రాతినిధ్యం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గతేడాది నవంబరు నుంచి తాను ఉద్యమాన్ని ఉధృతం చేశానని, ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించానని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించానని వివరించారు. గతంలో మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీతో సహా దాదాపు 13 పార్టీల నేతలు ధర్నాకు హాజరయ్యి మద్ధతు ప్రకటించారని తెలిపారు. ఆ పార్టీల నేతలతో సంతకాలు తసుకొని తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి కూడా పంపించామన్నారు. తమ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని, ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. రాజకీయ పార్టీలు వాటంతట అవే మహిళలకు అవకాశాలు కల్పిస్తాయని భావించలేమని, కాబట్టి చట్టం ద్వారానే రాజకీయ వ్యవస్థలో మహిళలకు అవకాశాలు సాధించగలమన్నది తన అభిప్రాయమన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్ కు ముడిపెట్టడం సరికాదని సూచించారు. దేశంలో అనేక ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలిపారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55-57 శాతం మహిళా ప్రజాప్రతినిధేల ఉన్నారని, కానీ సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. ఆ దిశగా బీఆర్ఎస్ కృషి చేస్తుందని, మార్పు సాధ్యమని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు, మహిళా భద్రత గురించి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు.