Bathukamma 2023 : బతుకమ్మ పండుగ.. అదొక పూల జాతర. అదొక ప్రకృతి వేడుక. ఈ పండుగ వెనుక పురాణ గాథలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అలసిపోయి మూర్ఛిల్లిందట. అప్పుడు ఆమెను మేలుకొలిపేందుకు దేవుళ్లంతా పూలగౌరమ్మను పేర్చి పాటలు పాడారట. బతుకమ్మా బతుకమ్మా అంటూ వేడుకున్నారట. ఇది జరిగింది దసరా నవరాత్రుల్లోనే అని, నాటి నుంచి అమ్మ విజయానికి గుర్తుగా బతుకమ్మ వేడుకను చేసుకుంటున్నారని అంటారు. ఇలా బతుకమ్మ పండుగ పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈనేపథ్యంలో బతుకమ్మను పూలతో శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారు ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join
దాదాపు వెయ్యేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతం కల్యాణి చాళుక్యుల పాలనలో ఉండేది. వేములవాడ చాళుక్యులు వీరికి సామంతులుగా ఉండేవారు. ఆ సమయంలో కల్యాణి చాళుక్యులకు, చోళులకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో వేములవాడ చాళుక్యులు, కల్యాణి చాళుక్యుల పక్షం వహించారు. అప్పటికే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ సమయంలో చోళ చక్రవర్తి రాజరాజు కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయంలోని భారీ శివలింగాల్ని పెకిలించి తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా ఇచ్చాడట. పార్వతీసమేతుడై ఉన్న శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు క్రీ.శ 1010లో బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించినట్టు తమిళ శిలాశాసనాల్లోనూ ఉందని చెబుతారు.
తెలంగాణలోని బృహదమ్మ (పార్వతి) నుంచి బృహదీశ్వరుడిని వేరుచేయడంతో ఇక్కడి ప్రజలు నొచ్చుకున్నారు. ఆమెకు సాంత్వన చేకూర్చేందుకు శివలింగాకృతిలో గౌరీదేవి రూపంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడారట. ఈ ఘటనకు గుర్తుగా ప్రతి ఏడాదీ బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నారని అంటారు. బృహదమ్మ (గొప్పది)నే జన వ్యవహారంలో ‘బతుకమ్మ’గా మారిందని నమ్ముతారు.ఏటా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య (భాద్రపద అమావాస్య) రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ వేడుక (Bathukamma) ముగుస్తుంది. ఈ ఏడాది 14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.