YS Jagan Vs Sr NTR : ఎన్టీఆర్ ను మరిపించేలా జగన్

పీఆర్సీ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు జగన్ మాదిరిగా వ్యవహరించాడు. కానీ , చివరకు ఉద్యోగుల దెబ్బకు చందశాసనుడిగా పేరున్న ఎన్టీఆర్ ను మెట్టు దించారు.

  • Written By:
  • Publish Date - January 25, 2022 / 12:28 PM IST

పీఆర్సీ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు జగన్ మాదిరిగా వ్యవహరించాడు. కానీ , చివరకు ఉద్యోగుల దెబ్బకు చందశాసనుడిగా పేరున్న ఎన్టీఆర్ ను మెట్టు దించారు. దానికి కారణం ఆనాడు కీరోల్ కామ్రేడ్లు పోషించాడట. లేకపోతే ఎన్టీఆర్ జీతాలు పెంచడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే సుమారు 53 రోజులు ఆనాడు సమ్మె చేశారు. అప్పట్లో కమ్యూనిస్టు లు లైజనింగ్ చేయకపోతే ఉద్యోగుల పని ఆ రోజే ఎన్టీఆర్ పెట్టేవాడు. ఇప్పుడైనా జగన్ ఉద్యోగుల భరతం పడతాడా? లేక ఎవరైనా లైజనింగ్ చేస్తే లొంగుతాడా? అనేది పెద్ద ప్రశ్న. ఇపుడు కూడా ప్రభుత్వం ఉద్యోగులకు లొంగితే ఇక వాళ్ళ గొంతెమ్మ కోర్కెలకు అంతే ఉండదు. రాబోయే ప్రభుత్వాలను కూడా ఆడుకుంటారు. ఇప్పటికే ఏపీ దివాళా దిశగా వెళుతుంది. ఇక ఉద్యోగుల కోర్కెలు తీర్చాలంటే రాష్ట్రన్నీ అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను జగన్ మరిపిస్తున్న సమయం ఇది. ఒకసారి పీఆర్సీ , సమ్మె చరిత్రను ఆవలోకిస్తే…చంద్రబాబునాయుడు ప్రభుత్వం నియమించిన అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిషన్ సిఫార్సులను జగన్ పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ చేసిన ప్రతిపాదనల ఆధారంగా పీఆర్సీని ప్రకటించడం జరిగింది. ఈ పీఆర్సీ కారణంగా జీతాలు పెరగడం అటుంచి తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో లైట్ తీసుకొన్నాడు .కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే చండశాసనుడైన ఎన్టీ రామారావుకే చెమటలు పట్టించిన ఘనులు ప్రభుత్వోద్యోగులు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాగే పీఆర్సీ విషయమై 1986 లో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై మూడు రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు.

1986 జులైలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పటి పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపారు.అయితే మూడు అంశాలపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.కొత్త పీఆర్సీని ఆ ఏడాది జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలని,మినిమం బేసిక్ పేను 740 నుండి 750 రూపాయలు అంటే కేవలం పది రూపాయలు పెంచాలని, అప్పటివరకూ ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ ను బేసిక్ పేలో కలపాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయగా ఎన్టీఆర్ ససేమిరా అన్నారు.ఆనాటి రాష్ట్ర ఆదాయంలో 48శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నాయని,ఇక పెంచే అవకాశమే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు 1986 వ సంవత్సరం నవంబర్ అయిదో తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు.స్కూళ్లు మూతపడ్డాయి.ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కూడా అందలేదు.ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పాలన దాదాపు స్తంభించింది.

సమ్మె ప్రారంభమైన కొద్ది రోజులకు ఎన్టీఆర్ కాస్త దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి ఒక కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు.కానీ ప్రభుత్వోద్యోగులు దాన్నీ తోసి రాజన్నారు.సీఎంతో తప్పితే ఇతరులతో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.తమ సమ్మెను ఇంకా ఉధృతం చేశారు.పరిస్థితులు ప్రభుత్వం చేజారి పోయే విధంగా తయారవడంతో ఎన్టీఆర్ రాజదండం బయటకు తీశారు.ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నిర్వాహకులైన పన్నెండు మంది నాయకులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయించారు.దీంతో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారయింది.ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో రెచ్చిపోయారు. రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ నిర్వహించారు. శాంతిభద్రతలు కూడా భగ్నమయ్యే వాతావరణం నెలకొంది. ఉద్యోగులను వూస్టు చేస్తామని హెచ్చరిక చేసాడు.సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్టీఆర్ ఆదేశించారు.దీంతో పీటముడి మరింత బిగిసింది.ప్రభుత్వ ఉద్యోగులు కూడా తగ్గేదేలే అన్నట్టు సమ్మెను కొనసాగించారు.
ఈ దశలో ఎన్టీఆర్ కు కొండంత అండగా సుకుమార్ సేన్ నిలచాడు.వామపక్ష పార్టీ ఎంపీ, అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అయిన సుకుమార్ సేన్ రంగ ప్రవేశం చేశారు.ఎన్టీఆర్ కు, ప్రభుత్వోద్యోగులకు మధ్య రాయబారం నెరిపారు.సామరస్యపూరిత వాతావరణం నెలకొల్పారు.అటు ఎన్టీఆర్, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన నచ్చచెప్పారు.సుకుమార్ సేన్ మధ్యవర్తిత్వం ఫలించి యాభై మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు శుభం కార్డు పడింది. అంతిమ విజయం ప్రభుత్వ ఉద్యోగులదే కావడం ఇక్కడ గమనార్హం.

ఆనాడు సోషల్ మీడియా లేదు. ఉద్యోగులపై ప్రజలకు కొంత గౌరవం ఉండేది. ఇప్పుడు లాగా ఆరోజున గొంతెమ్మ కోర్కెలు లేవు. ప్రభుత్వాన్ని పడగొడతాం, దించుతాం, ఎక్కిస్తాం అనే డైలాగులు లేవు. కమ్యూనిస్టు నేతలు లైజనింగ్ చేయడానికి బలంగా లేరు. రాజకీయ పార్టీల నీడ ఆ రోజు జరిగిన సమ్మెపై లేదు. ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఆనాడు ఉన్నాయి. కులాల గొడవ లేదు. ఇపుడు ప్రజా వ్యతిరేకత ఉద్యోగులపై ఉంది. సోషల్ మీడియా బలంగా ఉంది. ఉద్యోగుల యాంటీ అజెండా తీసుకొని ఎన్నికలకు వెళ్లిన రాజకీయంగా లాభ పడే అంత వ్యతిరేకత ఉద్యోగులపై ఉంది. ఆనాడు ఎన్టీఆర్ ఉద్యోగులకు తల వంచడానికి ఇవాళ జగన్ తల ఎత్తడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఎన్టీఆర్ ను తలపించేలా ఉద్యోగుల విషయంలో చరిత్రను రాయడానికి జగన్ సిద్దంగా ఉన్నాడని తెలుస్తుంది. కేసీఆర్ ఎలా ఉద్యమాలను అణచి వేశాడో..ఇటీవల మనం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల రూపంలో చూసాం.సో ఇది ఎన్టీఆర్ కాలం కాదు..జగన్ , కేసీఆర్ టైం. ఉద్యోగుల భారతం ఎలా పట్టా లో..జగన్ కు తెలుసు. ఇక భవిష్యత్ లో ప్రభుత్వం మీద సమ్మె లేకుండా చేసేలా స్కెచ్ రెడీగా ఉందని తెలుస్తోంది.ఎన్టీఆర్ మాదిరిగా సమ్మెకు జగన్ దిగివస్తాడు అనేది ఉద్యోగుల కల. దానికి ఎలాంటి రూపం ఉంటుందో..చూద్దాం అంటూ ఒక వైసీపీ సీనియర్ అంటున్నాడు. సో..ఎన్టీఆర్ ను జగన్ మరిపించ నున్నడన్నమాట.