Pig Kidney : కిడ్నీ సమస్యలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఎంతోమందికి షుగర్ వ్యాధి ముదిరిపోయి.. కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ తరుణంలో శాస్త్రవేత్తల చూపు జంతువుల కిడ్నీలపై పడింది. ప్రత్యేకించి మనుషుల శరీరంలో అమర్చేందుకు అనువైన పంది కిడ్నీలపై గత కొన్నేళ్లుగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దిశగా అమెరికా వైద్య నిపుణులు కీలక ముందడుగు వేశారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల రోగికి విజయవంతంగా అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారి అని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెలలోనే ఆ వ్యక్తికి కిడ్నీ మార్పిడి సర్జరీ చేశామని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే డిశ్ఛార్జి చేస్తామన్నారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. అంతకుముందు పంది గుండెను(Pig Kidney) ఇద్దరికి అమర్చినప్పటికీ.. వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
గుండె, మూత్రపిండాలు, కంటి ఫెయిల్యూర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. చనిపోయినవారి నుంచి ఈ అవయవాలను సేకరించడమే ప్రస్తుతం వైద్యులంతా అనుసరిస్తున్న విధానం. అలాకాకుండా.. మనకు కావాల్సిన అవయవాలను జంతువుల్లో పెంచుకోగలిగితే ఎలా ఉంటుంది !! ఇదే ఆలోచన చైనాలోని గువాంగ్ఝౌ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ బయోమెడిసిన్ అండ్ హెల్త్ పరిశోధకులకు వచ్చింది. ఈ ప్రయోగానికి వారు పందులను వాడుకున్నారు. పరిశోధనలో భాగంగా మొత్తం 1820 పంది పిండాలను తీసుకుని.. వాటిలో సొంత మూత్రపిండాలు అభివృద్ధి చెందకుండా రెండు జన్యువులను తొలగించారు. వాటి స్థానంలో మానవ మూలకణాలను ప్రవేశపెట్టారు. ఆ మూలకణాలు పందుల శరీరాల్లో పెరగడానికి వీలుగా వాటిలో రెండు కీలక జన్యువుల శక్తిని జన్యు ఇంజనీరింగ్ ద్వారా పెంచారు.
అలా మానవ మూలకణాలను చొప్పించిన పంది పిండాలను.. 13 పందుల పునరుత్పత్తి వ్యవస్థల్లో ప్రవేశపెట్టి 25 నుంచి 28 రోజులు వేచిచూశారు. అనంతరం ఆ పిండాలను బయటకు తీసి పరిశీలించగా.. 1820కిగాను కేవలం 5 పిండాల్లో మాత్రమే ఈ ‘హైబ్రీడ్ మూత్రపిండాలు’ మీనియేచర్ ట్యూబ్యూల్స్ వంటివాటితో విజయవంతంగా అభివృద్ధి చెందాయి. ఆ మూత్రపిండాల్లో 50-65 శాతం వరకూ మానవ కణాలు కాగా.. మిగతావి పంది కణాలు. అవయవదానం భవిష్యత్తుపై గొప్ప ఆశలు రేకెత్తించే ఫలితం ఇదని వైద్యనిపుణులు అంటున్నారు. ఇప్పుడు చైనా పరిశోధకులు అభివృద్ధి చెందిన మూత్రపిండాల్లో మానవ కణాల సంఖ్య 50 నుంచి 65 శాతం దాకా ఉండడమంటే చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.