Apara Ekadashi Vrat : జూన్ 2న (ఆదివారం) వైశాఖ బహుళ ఏకాదశి. దీన్నే ‘అపర ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఏకాదశి తిథి విష్ణుమూర్తి పూజకు శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామనవతారాన్ని ఈ అపర ఏకాదశి రోజు పూజించాలని శాస్త్రం చెబుతోంది. అపర ఏకాదశి రోజున ఎవరైతే తనను నిష్ఠగా పూజిస్తారో వారి పాపాలన్నీ అగ్నికి ఆహుతియైన దూది పింజల్లాగ నశించిపోతాయని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పలికినట్లుగా శాస్త్రం చెబుతోంది. అపర ఏకాదశి రోజు ఏయే పూజలు చేయాలి? ఉపవాస నియమాలు ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
ఉపవాసం
అపర ఏకాదశి రోజు(Apara Ekadashi Vrat) ఉపవాసం చేసేవారు సూర్యోదయం నుంచే ఆహరం తీసుకోకూడదు. సాయంత్రం దీపారాధన చేసి, నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పాలు పండ్లు తీసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం పాటించేవారు ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు. మద్యపానం నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి జాగరణ
ఏకాదశి రోజు జాగారం చేసే వాళ్లు శ్రీమన్నారాయణుని కథలు, భజనలు, నామ సంకీర్తనలు చేయాలి. ఏకాదశి మరుసటి రోజును ద్వాదశి అంటారు. ఆ రోజు పూజాదికాలు చేసిన తర్వాత ఒక అతిథికి భోజనం పెట్టాలి. అనంతరం మనం భుజించాలి. ఏకాదశి ఉపవాసం చేసిన వారు అతిథికి భోజనం పెట్టకుండా తింటే ఏకాదశి వ్రత ఫలం దక్కదు. అంతకుముందు ఏకాదశి రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అన్నార్తులందరికి కూడా అన్నదానం చేయవచ్చు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటివి అందించాలి.
వామన పూజ
అపర ఏకాదశి రోజు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వామనావతారాన్ని తులసి దళాలతో అర్చించాలి. విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. చామంతులు, మల్లెలతో అర్చన చేయాలి. తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ మొదలైనవి అర్పించాలి. విష్ణుమూర్తికి చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. కాగా, అపర ఏకాదశిని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు.