ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ హవా కనిపించినప్పటికీ మోడీకి అసలైన ఛాలెంజ్ ముందుందని బెంగాల్ సీఎం మమత గుర్తు చేస్తోంది. గేమ్ ఇంకా ముగియలేదని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలంటే ఏమిటో చూపిస్తామంటోంది. విపక్షాల మద్ధతు లేకుండా బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం అసాధ్యమని దీదీ ఆసక్తిర కామెంట్ చేసింది. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసంటూ సెటైర్ వేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సగానికిపైగా విపక్ష పార్టీలకు చెందిన వాళ్లు ఉన్నారని మోడీకి చురకేసింది.ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అత్యున్నత పదవికి ముందంజలో ఉన్నాడు. అయితే రామ్ నాథ్ కోవింద్కు రెండవసారి పదవి ఇవ్వాలా వద్దా అనే దానిపై బిజెపి నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే ఆ పదవికి. రెండుసార్లు ఎన్నికయ్యాడు.అందరికీ అనుకూలమైన అభ్యర్థిని క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ పార్టీల మద్ధతను కూడా కూడగట్టకుని బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్ ఉంది. రాష్ట్రపతి పదవి కోసం వెంకయ్యనాయుడు పేరు ఆమోదయోగ్యంగా బీజేపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. పైగా నవీన్ పట్నాయక్, జగన్, కేసీఆర్ కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విషయాన్ని పరోక్షంగా బెంగాల్ సీఎం మమత తాజాగా వెల్లడించింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్ ముందడుగు వేయడం కష్టం. తృణమూల్ కాంగ్రెస్, DMK, శివసేన, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర ప్రాంతీయ పార్టీలు ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని పెట్టాలా? వద్దా? అనే కీలక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది కీలక నేతలకు నాయకుడిగా ఆజాద్ ఉన్నాడు. రాజసభ నేతగా ఆజాద్ పదవీకాలం పూర్తయ్యాక తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మోదీ.. సభలోనే కంటతడి పెట్టాడు. అప్పుడే వారి మధ్య రాజకీయబంధం ఎంత బలంగా ఉందో అన్ని పార్టీలకు అర్థమైంది.గులాంనబీ ఆజాద్ కు ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆయన్ను రాష్ట్రపతిగా బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉందని యూపీ పోలింగ్ ముందు జాతీయ మీడియా ఫోకస్ చేయడాన్ని గమనిస్తే కమలనాథుల వ్యూహం అర్థం అవుతోంది.
ఇటీవల జాతీయ స్థాయి ఫ్రంట్ అంటూ నినదించిన కేసీఆర్ తెర వెనుక ఉప రాష్ట్రపతి పదవికి అవసరమైన మద్ధతు కూడగట్టేందుకు ప్రయత్నించాడని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల మద్ధతుగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ పుట్టుకపై మాట్లాడిని హర్యానా సీఎంపై కేసీఆర్ ఫైర్ అయ్యాడు. రాహుల్ ఇటీవల చేసిన ప్రసంగాలకు మద్ధతు పలుకుతున్నాడు. ఇవన్నీ చూస్తూంటే కేసీఆర్ పైకి చెబుతోన్న ఫ్రంట్ కంటే కూడా ఉపరాష్ట్రపతి పదవి కోసం మద్ధతు కూడగట్టే ప్రయత్నం అంటూ భావించిన వాళ్లు లేకపోలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలలో ఉభయ సభలకు చెందిన 776 మంది ఎంపీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. మొత్తంగా ఎలక్టోరల్ కాలేజీలో 1,098,903 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కావాలంటే కనీసం 549,452 ఓట్లను సంపాదించాలి. ఆయా రాష్ట్రాల్లోని ఓట్ల విలువ విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 83,824 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని తెలుసు.ఎన్టీయే, యూపీయేతర పార్టీలు కలిసి అభ్యర్థిని నిలిపితే విపక్ష శిబిరంలోని ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు చేతులు కలిపి ఉమ్మడి అభ్యర్థిని పెట్టినట్లయితే యూపీఏలో విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఫలితంగా బిజెపి నిలిపే అభ్యర్థి గెలిచే అవకాశం మెండుగా ఉంటుంది. అలా కాకుండా అబ్దుల్ కలాం లేదా ప్రతిభా పాటిల్ వంటి అభ్యర్థుల తరహాలో గులాంనబీ ఆజాద్ ను బీజేపీ ఎంపిక చేస్తే ఈజీగా గెలుపు సాధ్యం అవుతుందని బీజేపీలోని కొందరి అంచనా.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రపతి ఎన్నికల్లో కీలక రోల్ పోషించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ను కలుపుకుంటే 200 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే, దాదాపు సగం ఎలక్టోరల్ కాలేజీలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కీలకం అవుతాయి. దక్షిణ భారత దేశం నుంచి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవుల్లో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది. ఈసారి రాష్ట్రపతి పదవి రేసులో గులాంనబీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ పట్టుబడితే, అద్వానీకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఉప రాష్ట్రపతి పదవిని దక్షిణ భారత దేశానికి ఇస్తే ప్రధమంగా కేసీఆర్ పేరు వినిపించేలా ఆయన ఫోకస్ అవుతున్నాడని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవికి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే.. ఏపీ, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర సీఎంలు మద్ధతు పలుకుతారని ఇప్పటి వరకు కనిపిస్తోన్న ముఖచిత్రం. రేసులోకి నితీష్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఈ ఏడాది జూలైలో జరగబోతున్నాయి. వాటి కంటే ముందుగా మార్చి 31న రాజ్యసభ ఎన్నికలను నిర్వహిస్తారు. తాజాగా వచ్చిన ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజ్యసభపై పట్టును బీజేపీకి మరింత పెంచింది. భారత రాష్ట్రపతిని 776 మంది పార్లమెంటేరియన్లు మరియు 4,120 మంది శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,98,903 ఓట్లు కాగా, బీజేపీ బలం సగం కంటే ఎక్కువగా ఉంది. ఎంపీకి ఒక్కో ఓటు విలువ 708. ఎమ్మెల్యేల విషయానికొస్తే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓటు విలువ ఒక్కోలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓట్లకు అత్యధిక విలువ – 208 అత్యధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు 270 సీట్లకు పైగా గెలుపొందడంతో తదుపరి రాష్ట్రపతిని ఎంచుకోవడానికి అధికార పార్టీ కి అనుకూలంగా ఉంది.