Owaisi – Jai Palestine : హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే లోక్సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేశారు. దానిపై తాజాా సుప్రీంకోర్టు న్యాయవాది హరిశంకర్ జైన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈనెల 25న లోక్సభ సభ్యత్వ ప్రమాణ స్వీకార ప్రసంగంలో ‘జై పాలస్తీనా’ అనే పదాన్ని వాడినందుకు ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును హరి శంకర్ కోరారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(డి) ప్రకారం.. ఎవరైనా పార్లమెంటు సభ్యుడు విదేశానికి విధేయత ప్రకటిస్తే సభకు అనర్హులుగా మారుతారు. ఈ నిబంధన కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలి’’ అని రాష్ట్రపతిని కోరారు. జై పాలస్తీనా నినాదాలు చేయడం ద్వారా ఆ దేశానికి ఒవైసీ విధేయత ప్రకటించారని ఆరోపించారు. ‘‘ఒవైసీ చర్య దేశ భద్రతకు ముప్పు లాంటిది. ఆయనపై తగిన చర్య తీసుకోవాలి’’ అని న్యాయవాది హరిశంకర్ జైన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ఆర్/డబ్ల్యూ 103 ని ఉల్లంఘించిన ఒవైసీపై చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఒవైసీ నినాదాలు చేయడంపై అభ్యంతరం తెలుపుతూ కొంతమంది లోక్సభ సభ్యులు తనకు ఫిర్యాదు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల నిబంధనలను తనిఖీ చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘భారత్కు పాలస్తీనాతో కానీ.. మరే దేశంతో కానీ ఎలాంటి శత్రుత్వం లేదు. విషయం ఏమిటంటే.. లోక్సభ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మరొక దేశాన్ని ప్రశంసించడం సరైనదేనా? కాదా ? రాజ్యాంగంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి ? అనేది తెలుసుకునే పనిలో మేం ఉన్నాం. కొంతమంది సభ్యులు వచ్చి ఫిర్యాదులు ఇచ్చి వెళ్లారు’’ అని కిరణ్ రిజిజు చెప్పారు.
బుధవారం రోజు దక్షిణ గోవాలోని పోండా తాలూకాలో వైష్విక్ హిందూ రాష్ట్ర మహోత్సవ్ 12వ సదస్సు జరిగింది. ఈ సమావేశం వేదికగా హిందూ సంఘాల నాయకులు ఒవైసీపై మండిపడ్డారు. జై పాలస్తీనా నినాదాలు చేయడం ద్వారా ఒవైసీ తప్పుచేశారని విమర్శించారు. ఒవైసీ(Owaisi – Jai Palestine) నినాదాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
ఇక హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఎవరి బెదిరింపులకూ తాను భయపడబోనని తేల్చి చెప్పారు. ‘‘వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి.. నాకు కూడా రాజ్యాంగం గురించి కొంచెం తెలుసు.. ఈ ఖాళీ బెదిరింపులు నాపై పని చేయవు’’ అని అసదుద్దీన్ తెలిపారు. ‘‘ప్రమాణ స్వీకారం చేసే టైంలో అందరూ చాలా పదాలు వాడుతున్నారు. నేను ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అని చెప్పాను. అది రాజ్యాంగానికి వ్యతిరేకమా ? కాదా ? అనేది రాజ్యాంగంలోని నిబంధనలు చూసి తెలుసుకోండి’’ అని ఒవైసీ సూచించారు.