IPL Betting : ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. ఇందుకోసం ప్రధాన బుకీలు హైదరాబాద్లోని బంజారాహిల్స్, బేగంబజార్, ఘాన్సీబజార్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని హోటళ్లు, ఫామ్హౌస్లలో గదులను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. రూ.1000 నుంచి మొదలుకొని రూ.10లక్షల వరకు బెట్టింగ్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
We’re now on WhatsApp. Click to Join
ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ నగరంలో రూ.500 కోట్లమేర పందెపు సొమ్ములు చేతులు మారుతుంటాయని అంచనా. వీటిలో కేవలం 5-10శాతం మాత్రమే పోలీసులకు దొరుకుతుంటాయి. బెట్టింగ్ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుండటంతో అంత ఈజీగా వ్యవహారాలు బయటికి రావడం లేదు. పెద్దఎత్తున అప్పులు చేసి కొన్ని బెట్టింగ్ యాప్లలో పందేలు కాసి నష్టపోతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలా నష్టాలు రావడంతో కుంగిపోయి కొందరు సూసైడ్ చేసుకున్న దాఖలాలను మనం ఇటీవల కాలంలో చాలా చూశాం. ఫైనల్ మ్యాచ్లో కోల్కతా తరఫున రూ.2.5 కోట్లు పందెం కాశానంటూ కెనడా ర్యాపర్, సంగీతకారుడు డ్రేక్ గ్రాహం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుందని డ్రేక్ ఏకంగా రూ.2 కోట్ల పందెం కాశాడు. ఒకవేళ అతడి అంచనా నిజమైతే రూ.4 కోట్లు సంపాదించే చాన్స్ ఉంది. అయితే.. గతంలో డ్రేక్ పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో, ఈసారి కూడా అదే జరుగుతుందని కొందరు అనుకుంటున్నారు. డ్రేక్ అంచనాలు గతంలోనూ పలుమార్లు తప్పాయి. ఫిఫా వరల్డ్ కప్తో మొదలు ఇతర సాకర్ మ్యాచుల్లో డ్రేక్ పందెం కాసి భారీ మొత్తం పోగొట్టుకున్నాడు. దీన్ని బట్టి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ స్థాయిలో బెట్టింగ్(IPL Betting) జరుగుతుందో మనం అంచనా వేసుకోవచ్చు.
పదిహేడో ఐపీఎల్ సీజన్లో కోల్కతా జట్టు నిలకడగా రాణిస్తూ 9 విజయాలతో టేబుల్లో టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్ 1 లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో కమిన్స్ సేన స్వల్ప స్కోర్కే పరిమితమై మ్యాచ్ను చేజార్చుకుంది. అనంతరం చెపాక్లో జరిగిన క్వాలిఫయర్ 2లో సన్రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్కు చెక్ పెట్టి ఫైనల్కు దూసుకెళ్లింది. స్పిన్నర్లకు స్వర్గధామమైన చెపాక్ స్టేడియంలో మే 26న ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. దాంతో, కోల్కతా మూడో టైటిల్ అందుకుంటుందా? ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో రెండో ట్రోఫీ చేరుతుందా? అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.