90 Died : పడవ మునిగి దాదాపు 90 మంది చనిపోయారు. మొజాంబిక్ దేశ ఉత్తర తీరంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న టైంలో పడవలో దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మత్స్యకారుల పడవ మొజాంబిక్ దేశంలోని నాంపులా ప్రావిన్స్ పరిధిలోని ఓ ద్వీపానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 90 మంది(90 Died) చనిపోగా, ఐదుగురిని ప్రాణాలతో కాపాడారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం బాధాకరం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ప్రమాదం జరిగిన సముద్ర తీరంలోని బీచ్లో డజన్ల కొద్దీ మృతదేహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
సముద్రంలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే సముద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా జరుగుతోందని సమాచారం. స్థానికంగా కలరా దారుణంగా ప్రబలుతుండటంతో వారంతా దేశంలోని మరో ప్రాంతానికి వలస వెళ్తుండగా ఈ దారుణం జరిగిందిన అంటున్నారు. పడవలో పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో.. అది కంట్రోల్ కోల్పోయి బోల్తాపడి సముద్రంలో మునిగిందని చెబుతున్నారు. ప్రపంచంలోని అతి పేద దేశాల్లో మొజాంబిక్ ఒకటి. ఇక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది.
గత ఏడాది జనవరి నుంచి మొజాంబిక్ దేశంలో కలరా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. దీనివల్ల నంపులా ప్రావిన్స్ బాగా ప్రభావితమైంది. గత 25 ఏళ్లలో ఇంత ఘోరంగా కలరా వ్యాప్తి ఎన్నడూ జరగలేదని అంటున్నారు. 2023 అక్టోబర్ నుంచి మొజాంబిక్లో 13,700 కలరా కేసులు నమోదవగా, 30 కలరా మరణాలు సంభవించాయి. ఇక నంపులా ప్రావిన్స్ పొరుగున ఉన్న కాబో డెల్గాడో ప్రావిన్స్లో ఇస్లామిక్ తిరుగుబాటు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటి నుంచి జరుగుతున్న నరమేధం, వర్గ తగాదాలలో దాదాపు 4,000 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది మొజాంబిక్ దేశస్తులు వలస వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 400 సంవత్సరాల పాటు మొజాంబిక్ ద్వీపం పోర్చుగీస్ పాలనలో ఉంది. ఈ అందమైన ద్వీప దేశంలో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు చాలానే ఉన్నాయి.