Hajj Pilgrims : సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఈసారి దాదాపు 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లగా.. వివిధ దేశాలకు చెందిన దాదాపు 550 మంది యాత్రికులు చనిపోయారు. వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్టు దేశస్తులే కావడం గమనార్హం. హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్స్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వయసు పైబడినవారు, తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు 60 మంది జోర్డాన్ దేశస్తులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వెళ్లిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్ దేశాల హజ్ యాత్రికులు(Hajj Pilgrims) కూడా కొందరు చనిపోయారు. సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయి. పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా 240 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.