Aircraft Missing : విమాన ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు. తాజాగా ఆఫ్రికా దేశం మలావీకి చెందిన ఉపాధ్యక్షుడు 51 ఏళ్ల సౌలోస్ చిలిమా వెళ్తున్న విమానం మిస్సయ్యింది. విమానంలో ఆయనతో దేశ మాజీ ప్రథమ మహిళ షానిల్ డిజింబిరి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. దేశ క్యాబినెట్కు చెందిన మంత్రి ఒకరు చనిపోవడంతో.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరంతా రాజధాని లిలాంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజూజు నగరానికి విమానంలో బయలుదేరారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘సోమవారం ఉదయం 9 గంటలకు విమానం ముజూజు నగరం సమీపంలోకి వెళ్లిన తర్వాత వాతావరణం ప్రతికూలించింది. దీంతో పైలట్ ఏదీ సరిగ్గా చూడలేకపోయాడు. దీంతో అతడు ముజూజు నగరంలో విమానాన్ని(Aircraft Missing) ల్యాండ్ చేయలేకపోయాడు. ఈవిషయాన్ని విమానయాన అధికారులకు పైలట్ చెప్పగా.. అతడిని లిలాంగ్వేకు తిరిగి వచ్చేయమని సలహా ఇచ్చారు. ఈక్రమంలో విమానంతో విమానయాన అధికారులకు కమ్యూనికేషన్ తెగిపోయింది’’ అని మలావీ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. ముజూజు నగరానికి దక్షిణాన ఉన్న కలప మిల్లింగ్ కంపెనీ రియాప్లీకి 10 కిలోమీటర్ల పరిధిలోని అడవుల్లో ఒక టెలి కమ్యూనికేషన్ సిగ్నల్ను గుర్తించామని ఆయన వెల్లడించారు. ఆ అడవుల్లో సైనికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. సోమవారం ఉదయం ఆ అడవుల్లో ఓ విమానం కూలిపోతుండగా కొంతమంది చూశారంటూ కొన్ని స్థానిక మీడియాలలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలావీ అధ్యక్షుడు చక్వేరా బహమాస్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
2014లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సౌలోస్ చిలిమాకు మలావీ యూత్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన 2022 సంవత్సరంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికార దుర్వినియోగం చేసి.. బ్రిటీష్-మలావియన్ వ్యాపారవేత్తకు ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలు చేకూర్చారనే అభియోగాలు చిలిమాపై వచ్చాయి. ఈ స్కాం వ్యవహారంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. దీంతో అప్పట్లో దేశ ఉపాధ్యక్షుడిగా చిలిమా అధికారాలను తాత్కాలికంగా రద్దు చేశారు. గత నెలలోనే ఓ మలావియన్ కోర్టు చిలిమాపై వచ్చిన ఆరోపణలను కొట్టివేసింది.