10 Policemen Killed : పాకిస్తాన్లో ఈనెల 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలు టార్గెట్గా ఉగ్రదాడులు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవల కరాచీలోని ఎన్నికల కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఆ ఘటనను మరువక ముందే సోమవారం తెల్లవారుజామున డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా చౌద్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది పోలీసు సిబ్బంది(10 Policemen Killed) మృతిచెందారు. ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. 30 మందికిపైగా ఉగ్రవాదులు ఈ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి దాదాపు రెండున్నర గంటల పాటు కాల్పులు జరిపారు. ఈవివరాలను ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసు చీఫ్ అక్తర్ హయత్ వెల్లడించారు. పోలీసు స్టేషన్పై మొదట గ్రనేడ్లు విసిరి ఆపై కాల్పులకు తెగబడ్డారు. దాడికి పాల్పడి పరారైన వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బార్డర్ ఏరియాలు తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడి నుంచే పాక్ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఎటాక్స్ చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
పాకిస్తాన్ను ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు రాజకీయ సంక్షోభం అలుముకున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో పాకిస్తాన్లో మొత్తం 93 ఉగ్రదాడులు జరిగాయి.ఈ దాడుల్లో 90 మంది చనిపోగా.. 135 మంది గాయపడ్డారు. 15 మంది అదృశ్యమయ్యారు. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించారు. జనవరి 31న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థి రెహాన్ జెబ్ ఖాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ జిల్లాలో దారుణంగా మర్డర్కు గురయ్యారు. బైక్పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీన్నిబట్టి పాకిస్తాన్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
రెండేళ్ల కాలంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి జైలు వరకు వెళ్లారు. ఆయన స్థాపించిన పీటీఐ పార్టీ కోలుకోలేని రీతిలో పతనమైంది. ఈ ఎన్నికల్లో పీటీఐ పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారంతా స్వతంత్య్ర అభ్యర్థులకిందే లెక్క. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం పార్టీకి కేటాయించిన బ్యాట్ గుర్తును రద్దు చేశారు. అందువల్ల ఆ పార్టీ అభ్యర్థులంతా స్వతంత్ర అభ్యర్థులే. వారికి ఆయా నియోజకవర్గాల వారీగా ఎన్నికల గుర్తుల కేటాయింపు జరుగుతుంది. అయితే, నిరక్ష్యరాస్యత రేటు 58 శాతం ఉన్న పాకిస్తాన్ దేశంలో స్థానాల వారీగా అభ్యర్థులకు మంచం, సాక్సాఫోన్, కెటిల్ వంటి గుర్తుల కేటాయింపు జరిగా, ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై అవగాహన కల్పించడమనేది సాధారణమైన విషయమేమీ కాదు. పీటీఐ ఎన్నికల వ్యూహానికి ఇది పెద్ద అవరోధంగా చెప్పొచ్చు. తమ నాయకుడు పార్టీలో ఉన్నప్పటికీ టెక్నాలజీ సాయంతో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన ప్రసంగాలను ప్రసారం చేస్తూ, ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.